పాక్ సరిహద్దుల్లో షాకింగ్ ఇష్యూ... ముంబైలో హైఅలర్ట్!
అవును.. ఏప్రిల్ 24, 25 (గురు, శుక్రవారాలు) తేదీల్లో కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్ క్లూజివ్ జోన్ లో భూతలం నుంచి భూతలంపైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్థాన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
By: Tupaki Desk | 24 April 2025 12:46 PM ISTజమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి ఘటన ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన పాక్... ఆ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. మరోపక్క ఆ దేశ మిలటరీ అప్రమత్తమవ్వడంతో సరిహద్దుల్లో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి!
ఇందులో భాగంగా.. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం పాక్ ఎయిర్ ఫోర్స్ విమానాలు.. కరాచీలోని సౌత్ ఎయిర్ కమాండ్ నుంచి నార్త్ వైపుగా లాహోర్, రావల్పిండి సమీపంలోని ఇండియన్ బోర్డర్ సమీపంలో వారికున్న అత్యంత కీలకమైన నూర్ ఖాన్ బేస్ వైపు కదిలినట్లు కథనాలొచ్చాయి. ఈ సమయంలో మరో విషయం తెరపైకి వచ్చింది.
అవును.. ఏప్రిల్ 24, 25 (గురు, శుక్రవారాలు) తేదీల్లో కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్ క్లూజివ్ జోన్ లో భూతలం నుంచి భూతలంపైకి క్షిపణి ప్రయోగాలు నిర్వహించేందుకు పాకిస్థాన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరిణామాలను భారత సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నట్లు రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి.
ముంబైలో హైఅలర్ట్!:
పహల్గాం లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు నగరమంతా క్రమం తప్పకుండా రాత్రిపూట గస్తీ నిర్వహించాలని పోలీసులకు, సీనియర్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో.. ప్రధానంగా బీచ్, స్టార్ హోటల్స్, రైల్వే స్టేషన్స్ వంటి చోట పెట్రోలింగ్ జరుగుతోంది.
ఉదమ్ పూర్ లో ఎన్ కౌంటర్!:
మరోపక్క జమ్ముకశ్మీర్ లోని ఉదమ్ పుర్ లో గురువారం ఎన్ కౌంటర్ జరుగుతోంది. ఈ క్రమంలో దుడు – బసంత్ గఢ్ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఫైరింగ్ మొదలైంది. ఈ ఘటనలో ఓ సైనికుడు అమరుడయ్యారని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.
