'వాడొక పెద్ద జోకర్'.. షాహిద్ ఆఫ్రిదిపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు
మాజీ క్రికెటర్ చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ, ఆఫ్రిదిని 'పెద్ద జోకర్' అని, పనికిరాని వాడని విమర్శించారు.
By: Tupaki Desk | 28 April 2025 4:53 PMపాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది భారత ప్రభుత్వం, సైన్యంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఆఫ్రిదిని 'పెద్ద జోకర్' అంటూ విమర్శించారు. ముఖ్యంగా పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత సైన్యంపై ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పహల్గామ్ సంఘటనపై స్పందించిన షాహిద్ ఆఫ్రిది, ఈ దాడికి భారత సైన్యం చేతగానితనం, వైఫల్యమే కారణమని ఆరోపించారు. భారత ప్రభుత్వం తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిసారి పాకిస్థాన్పై ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందని ఆఫ్రిది మండిపడ్డారు.
మాజీ క్రికెటర్ చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ, ఆఫ్రిదిని 'పెద్ద జోకర్' అని, పనికిరాని వాడని విమర్శించారు. పనికిరాని వాళ్ల గురించి మాట్లాడటం సమయం వృథా తప్ప ఏమీ ఉండదని ఆయన అన్నారు
అదే సమయంలో పాకిస్తాన్ దేశానికి వ్యతిరేకంగా భారత్ కఠిన చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్లో చేర్చాలని ఆయన కోరారు. సైబర్ దాడులతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కింద మిలిటరీ యాక్షన్ తీసుకోవాలని కూడా అభ్యర్థించారు. పాకిస్తాన్ను ఆర్థికంగా బలహీనపరిచేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీని ఒవైసీ డిమాండ్ చేశారు.
తమ దగ్గర అణుబాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పదే పదే చెప్పుకుంటుందని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం పేరుతో అమాయకులను చంపితే ఏ దేశం కూడా ఊరికే ఉండదని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్ వాళ్లు పోను పోను ఐఎస్ఐఎస్ కి వారసులుగా మారుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పాకిస్తాన్పై కేంద్రం కఠిన వైఖరి అవలంబించాలని ఓవైసీ బలంగా స్పష్టం చేశారు.