ఆపరేషన్ సిందూర్ సక్సెస్... దేశ వ్యాప్తంగా బీజేపీ బిగ్ ప్లాన్!
ఆపరేషన్ సిందూర్ ఫుల్ సక్సెస్ అనే మాట యావత్ భారత్ చెప్పిన సంగతి తెలిసిందే! దీంతో.. దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట క్యాపెయిన్ చేపట్టనుంది బీజేపీ.
By: Tupaki Desk | 12 May 2025 5:57 PMపహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ లోయలో సందడిగా, ఆహ్లాదంగా గడుపుతున్న పర్యాటకులపై భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రమూకలు ఒక్కసారిగా కాల్పులు జరిపాయి. ఈ సమయంలో మతం అడిగి మరీ వారిపై విరుచుకుపడటం గమనార్హం. ఈ పాశవిక దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందారు.
దీంతో... భారతదేశం ప్రతీకార జ్వాలతో రగిలిపోయింది. ఈ క్రమంలో మే 6, 7 మధ్య రాత్రి పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రశిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం విరుచుకుపడింది. అర్ధరాత్రి దాటిన తర్వాత 25 నిమిషాల వ్యవధిలో 9 ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసి, 100 మంది ఉగ్రమూకలను మట్టుబెట్టింది.
ఈ విషయంలో భారత సైన్యం దాడి కేవలం సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కాలేదు. నేరుగా పాక్ లోని కీలక ప్రాంతాలనూ టచ్ చేసింది. పంజాబ్ లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది! దీంతో.. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అనే మాట వినిపించింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని అధికారం ఎన్డీయే కూటమిలో కీలకమైన బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.
అవును... తాజాగా కాల్పుల విరమణ ఒప్పందంపై వినిపిస్తున్న భిన్నాభిప్రాయాల సంగతి కాసేపు పక్కనపెడితే... మే 6, 7 తేదీల్లో పాక్, పీవోకే లో 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసే విషయంలో ఆపరేషన్ సిందూర్ ఫుల్ సక్సెస్ అనే మాట యావత్ భారత్ చెప్పిన సంగతి తెలిసిందే! దీంతో.. దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట క్యాపెయిన్ చేపట్టనుంది బీజేపీ.
ఇందులో భాగంగా... మే 13 నుంచి ఈ యాత్రను ప్రారంభించి, 11 రోజుల పాటు క్యాపెయిన్ చేపట్టి.. ఈ నెల 23న ముగించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్యాంపెన్ లో ప్రధానంగా ప్రధాని మోడీ నాయకత్వ పటిమ, భారత సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా కొనసాగాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ తిరంగా యత్ర నిర్వహణపై చర్చించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, మొదలైన పలువురు అగ్రనేతలు సమావేశమయ్యరు. ఈ యాత్రలో పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.