ఆపరేషన్ సిందూర్ నష్టాలను చెప్పిన పాక్... లెక్కలివే!
అవును... భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వల్ల పాక్, పీవోకే లోని 9 ఉగ్రశిబిరాలు, 100 మంది ఉగ్రవాదులు నాశనం అయినట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 13 May 2025 9:24 AMఆపరేషన్ సిందూర్ తో పాకిస్థాన్ ను వణికించేశామని.. మన సైనిక దాడుల్లో పాక్ లో తీవ్ర నష్టాలు జరిగాయని.. ఈ క్రమంలో 100 మంది ఉగ్రవాదులతో పాటు సుమారు 35 నుంచి 40 మంది సైనికులు మృతి చెందారని భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ మిగిల్చిన నష్టాన్ని వెల్లడించింది పాక్!
అవును... భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వల్ల పాక్, పీవోకే లోని 9 ఉగ్రశిబిరాలు, 100 మంది ఉగ్రవాదులు నాశనం అయినట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ లో జరిగిన సైనిక నష్టాన్ని ఆ దేశం వెల్లడించింది. ఇందులో భాగంగా... భారత దాడుల్లో 11 మంది పాక్ సైనికులు మరణించినట్లు ఐ.ఎస్.పీ.ఆర్. వెళ్లడించింది.
ఇదే సమయంలో 78 మంది గాయపడ్డారని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐ.ఎస్.పీ.ఆర్) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో... ఐ.ఎస్.పీ.ఆర్. తో పాటు పాకిస్థాన్ సైనిక మీడియా విభాగం కూడా ఈ విషయాన్ని వెళ్లడించింది. అదేవిధంగా 40 మంది పౌరులు మరణించారని.. వారిలో ఏడుగురు మహిళలు, 15 మంది పిల్లలు ఉన్నట్లు తెలిపింది.
ఇక.. మరణించిన 11 మంది సైనికుల్లో ఆరుగురు పాకిస్థాన్ ఆర్మీకి చెందినవారని, మిగిలిన ఐదుగురు పాకిస్థాన్ వైమానిక దళానికి చెందినవారని తెలిపింది. వారి గొప్ప త్యాగం, ధైర్యం, భక్తి, అచంచలమైన దేశభక్తికి శాశ్వత చిహ్నం.. దేశం జ్ఞాపకార్థం శాశ్వతంగా చెక్కబడి ఉంటుందని ఐ.ఎస్.పీ.ఆర్. ప్రకటన తెలిపింది.