దాయాదీకి దామాషా ప్రకారం లెక్క... భారత రక్షణ శాఖ కీలక పోస్ట్!
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత రక్షణ శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖ ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 May 2025 12:20 PMఆపరేషన్ సిందూర్ అనంతరం భారత రక్షణ శాఖ, విదేశీ మంత్రిత్వ శాఖ ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దాడి జరిగిన విధానాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా... పాక్ లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని, కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు చేశామని తెలిపారు.
అయితే.. భారత్ లోని సైనిక లక్ష్యాలపై ఏదైనా దాడికి ప్రయత్నిస్తే కచ్చితంగా తగిన ప్రతిస్పందన ఉంటుందని కూడా పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఇందులో భాగంగా... మే 7-8 రాత్రి భారత్ లోని అవంతిపుర, శ్రీనగర్, జమ్ము, పఠాన్ కోట్, అమృత్ సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, చండీగఢ్, భటిండా, నల్, ఫలోడి, ఉత్తరలై, భుజ్ లతో సహా అనేక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించడానికి ప్రయత్నించిందని వెల్లడించింది.
వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏస్ గ్రిడ్, వైమానిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించి అడ్డుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఈ దాడులను రుజువు చేసే అనేక ప్రదేశాల నుంచి శిథిలాలను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో వైమానిక రక్షణ దాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ క్రమంలోనే లాహోర్ లోని వైమానిక రక్షణ వ్యవస్థ దెబ్బతిన్నట్లు తెలిసిందని తెలిపింది. మరోపక్క... జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా, బారాముల్లా, పూంచ్, ఉరి, మెంధార్, రాజౌరి రంగాలలోని ప్రాంతాల్లో పాకిస్థాన్ మోర్టార్లు, ఫిరంగులను ఉపయోగించి నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల తీవ్రతను పెంచిందని.. ఈ కాల్పుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలు సహా పదహారు మంది ప్రాణాలు కోల్పోయారని వెళ్లడించింది.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మోర్టార్లు, ఫిరంగులను అడ్డుకోవడానికి భారత్ స్పందించాల్సి వచ్చిందని తెలిపింది. ఈ సందర్భంగా... పాకిస్థాన్ సైన్యం గౌరవించే వరకూ, ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు భారత సాయుధ దళాలు తమ నిబద్ధతను పునరుధాటిస్తున్నాయని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే... ఇప్పటికీ పాక్ నుంచి భారత్ పై ఎదుదాడి జరుగుతూనే ఉందని అంటున్నారు! నియంత్రణ రేఖ వెంబడి భారత్ సైన్యంతో పాటు సామాన్య ప్రజానికంపైనా పాక్ సైన్యం కాల్పులు జరుపుందని తెలుస్తోంది. ఈ సమయంలో పాకిస్థాన్ లోని సుమారు 7 ప్రాంతాల్లో గగనతల వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసిందని తెలుస్తోంది.
అంటే... పాక్ తగ్గే వరకూ భారత్ తగ్గే మాట లేదన్న మాట! ఈ నేపథ్యంలోనే దాయాదీకి దామాషా పద్దతిలోనే సమాధానం ఇస్తామని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రెస్ రిలీజ్ పేజ్ లో ఓ పోస్ట్ చేసింది.