Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఆపరేషన్ సిందూర్.. పాక్ ఉగ్రస్ఘావరాలపై భారత్ మెరుపుదాడులు

మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున దాయాది పాక్ కు బుద్ధి చెప్పేందుకు వీలుగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ను షురూ చేసింది.

By:  Tupaki Desk   |   7 May 2025 9:00 AM IST
బ్రేకింగ్: ఆపరేషన్ సిందూర్.. పాక్ ఉగ్రస్ఘావరాలపై భారత్ మెరుపుదాడులు
X

మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున దాయాది పాక్ కు బుద్ధి చెప్పేందుకు వీలుగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ను షురూ చేసింది. పహల్గాం ఉగ్రదాడుల వేళ.. పలువురి మహిళల నుదిటి మీద ఉన్న సింధూరం పోయేలా చేసిన ముష్కరులకు బుద్ధి చెప్పటంతో పాటు.. వారి వెనకున్న పాక్ కు బుద్ధి చెప్పేందుకు వీలుగా నిర్వహించిన దాడులకు ‘ఆపరేషన్ సింధూర్’ నామకరణం చేశారు. మంగళవారం అర్థరాత్రి 1.44 గంటల ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ మొదలైంది.

పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. భారత ఆర్మీ.. ఎయిర్ ఫోర్సు.. నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో టార్గెట్లపై విరుచుకుపడ్డాయి. పాక్ అక్రమిత కశ్మీర్ తో పాటు పాకిస్థాన్ లోని ఉగ్ర మౌలిక సదుపాయాల్ని ధ్వంసం చేశాయి. భారత్ పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లుగా భావిస్తున్న తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది.

దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. పూర్తి కచ్ఛితత్వంతో దాడుల చేశామని. ఉద్రిక్త పరిస్తితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత సర్కారు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా ఈ రోజు (బుధవారం) సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ.. ఈ దాడులు చేయటం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ అనంతరం పలువురు కేంద్ర మంత్రులు.. భారత సైన్యం సోషల్ మీడియాలో స్పందించారు. భారత్ మాతాకీ జై అంటూ పలువురు కేంద్ర మంత్రులు.. ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నట్లుగా భారత్ వెల్లడించింది.

దాడులకు సంబంధించిన పూర్తి వివరాల్ని తాము త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్న రక్షణ శాఖ..ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత భారత ఆర్మీ సైతం స్పందించింది. ‘న్యాయం జరిగింది’ అంటూ ఎక్స్ లో పోస్టు పెట్టింది. మెరుపు దాడులకు సంబంధించిన వివరాల్ని.. దాడులు చేపట్టిన ప్రాంతాల వివరాల్ని వెల్లడించని భారత సైన్యం.. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోను మాత్రం షేర్ చేసింది.

తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ లోని శ్రీనగర్.. జమ్ము.. అమ్రత్ సర్.. ధర్మశాల.. లేహ్ ఎయిర్ పోర్టులను మూసేసినట్లుగా భారత్ ప్రకటించింది. భారత్ చేపట్టిన మెరుపు దాడులను పాక్ సైన్యం ధ్రువీకరించింది. పాక్ లోని కొట్టీ.. మురిడ్కే.. బహవల్పూర్.. ముజఫరాబాద్ ప్రాంతాల్లో భారత్ దాడులు చేపట్టినట్లుగా పాక్ డీజీ ఐఎస్ పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ పేర్కొన్నారు. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని.. 12 మందికి గాయాలు అయినట్లుగా పేర్కొన్నారు.

సమయం చూసుకొని స్పందిస్తామని.. భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్విత దు:ఖంతో భర్తీ చేస్తామంటూ ప్రకటన చేశారు. భారత్ జరిపిన మెరుపు దాడుల అనంతరం పాకిస్తాన్ లోని లాహోర్.. సియాల్ కోట్ ఎయిర్ పోర్టులను 48 గంటల పాటు మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. మెరుపు దాడులపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ‘‘మోసపూరిత శత్రువు పాకిస్తాన్ లోని 5 ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ చర్యలకు పాక్ కచ్ఛితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడింది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాక్ కు.. ఆర్మీకి బాగా తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం’’ అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.

పాక్ ప్రధాని ప్రకటన అనంతరం సరిహద్దుల్లోని పూంఛ్.. రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్ సైతం కాల్పులు మొదలుపెట్టింది. ఎల్ వోసీ వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే.. మెరుపు దాడులు నిర్వహించిన ప్రాంతంలో మురిడే టెర్రరిస్టు గ్రూపు లష్కరే తొయిబాకు హెడ్ క్వార్టర్ గా ఉన్నట్లు చెబుతున్నారు. పంజాబ్ ప్రావిన్స్ లోని బహవల్పూర్ లోని మసూద్ అజార్ నేత్రత్వంలోని జైషే - ఎ - మహ్మద్ స్థావరం ఉన్నట్లుగా చెబుతున్నారు. మెరుపు దాడుల అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు. దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు.