వయా అఫ్ఘాన్.. ఆపరేషన్ సిందూర్ ఆన్ గోయింగ్.. పాక్ కు భారత్ షాక్
పెహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకల స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టింది.
By: Tupaki Desk | 2 Dec 2025 1:00 AM ISTపెహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకల స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ ను చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ తో పాటు పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన ఈ దాడితో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. చివరకు పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. అయితే, ఒక మాట చెప్పింది. అప్పటికి యుద్ధం విరమించినా, ఆపరేషన్ సిందూర్ అనేది నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేసింది. భారత్ కు వ్యతిరేకంగా ఏ ఉగ్రవాద చర్య జరిగినా దానికి ప్రతిస్పందన అంతేస్థాయిలో ఉంటుందని కూడా తేల్చి చెప్పింది. మరి ఇది ఎలా..? అనేదే కదా మీ ప్రశ్న..? ఇప్పుడు చెప్పుకోబోతున్న ఓ ఉదాహరణ చూస్తే అందుకు సమాధానం దొరుకుతుంది. ఇందుకే ఇది ఆపరేషన్ సిందూర్ ఆన్ గోయింగ్.. వయా అఫ్ఘాన్ అని చెప్పుకోవాలి.
శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు..
తెలుగులో పాపులర్ సామెత ఒకటుంది. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు అని. ఇప్పుడు అక్షరాలా దీనినే నిజం చేసింది భారత్. తమ దేశంపై దాడులతో కొన్నాళ్లుగా పాకిస్థాన్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అఫ్ఘానిస్థాన్ ను అనుకూలంగా మలుచుకుంటోంది ఇండియా. అత్యంత రహస్యంగా తాజాగా పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తూంక్వా ప్రావిన్స్ లో జరిగిన డ్రోన్ దాడిని దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ దాడిలో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత్. దీనికి అఫ్ఘాన్ లోని బగ్రామ్ ను వ్యూహాత్మకంగా వినియోగించుకుంది. అంతకుముందే మరింత ముందుచూపుతో అఫ్ఘాన్ తో భారత్ ఎయిర్ ట్రాఫిక్ ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.
దుష్ప్రచారానికి తావులేకుండా
భారత్ తమపై దాడికి దిగుతోంది అంటూ పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజానికి ఫిర్యాదు చేసేందుకు వీలు లేకుండా అఫ్ఘాన్ ను ఉపయోగించుకుంటూ మన దేశం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇందులోభాగంగా కొందరు ఐసిస్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఖైబర్ ఫఖ్తూంక్వా వైపు వెళ్లేలా చేసింది. పీవోకేలో ఉంటే ప్రాణాలకు ముప్పు అనే ఫీలర్ ను వదిలింది. దీంతో వారు ఖైబర్ కు వెళ్లగా.. ఇదే సమయంలో కచ్చితమైన ప్రణాళికతో డ్రోన్ దాడికి దిగింది. అబ్దుల్ హకీం, గుల్ నజీమ్, సాదిక్ యార్ అనే ఉగ్రవాదులను హతమార్చింది.
అఫ్ఘాన్ టెరిటరీ నుంచి డ్రోన్లు వాడుతూ
అఫ్ఘాన్ టెరిటరీ వాడుతూ
తమ ప్రణాళికలో భాగంగా భారీ మిలట్రీ ఎక్విప్ మెంట్ రవాణా చేసే 130జె హెర్క్యులస్ విమానం ఢిల్లీ నుంచి ల్యాండ్ అయింది. దీనిలో ఇజ్రాయెల్ కు చెందిన హెరాన్ టీపీ అటాక్ యూఏవీని అమర్చింది. అయితే, భారత యుద్ధ విమానం బగ్రామ్ లో ల్యాండ్ అవలేదు. బగ్రామ్ ఎయిర్ బేస్ చుట్టూ తిరుగుతూ గాల్లో ఉండగానే యూఏవీ డ్రోన్ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఖైబర్ లోని ఐసిస్ ఉగ్రవాదులను కచ్చితమైన లక్ష్యంతో హతమార్చింది. ఇటీవలి కాలంలో అత్యంత కచ్చితత్వంతో జరిగిన దాడిగా దీనిని అభివర్ణిస్తున్నారు. బగ్రామ్ నుంచి వచ్చిన యూఏవీ కాబట్టి.. అఫ్ఘాన్ మద్దతు ఉన్న తెహ్రీక్ ఏ తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రసంస్థ చేసిన దాడిగా పాక్ భావిస్తోంది. అంతేకాని, సైనికంగా బాగా బలహీనంగా ఉండే అఫ్ఘాన్ వద్ద డ్రోన్లు ఉండే అవకాశం లేదని అనుకోవడం లేదు. ఇలా అఫ్ఘాన్ టెరిటరీలోని బగ్రామ్ ఎయిర్ బేస్ వాడుకుంటూ భారత్ చేసిన ఈ దాడి అఫ్ఘాన్ కూ ముందుముందు మంచి అవకాశమే.
కొసమెరుపుః అణు బాంబు ఉన్న దేశంగా పాకిస్థాన్ ఎప్పటికైనా ముప్పు అని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఆ దేశ అణు కార్యక్రమాలను ధ్వంసం చేసే ఉద్దేశం ఉంది. కానీ, గతంలో దానికి భారత భూభాగం వాడుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇకపై బగ్రామ్ ద్వారా దాడికి చాన్సుంది. ఇజ్రాయెల్ తలచుకుంటే అదెంత పని?
