పాకిస్తాన్ 10 ఫైటర్ జెట్లను ధ్వంసం చేశాం
భారత వైమానిక దళ (IAF) అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, 'ఆపరేషన్ సిందూర్'కు సంబంధించి సంచలనాత్మక ప్రకటన చేశారు.
By: A.N.Kumar | 3 Oct 2025 5:02 PM ISTభారత వైమానిక దళ (IAF) అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, 'ఆపరేషన్ సిందూర్'కు సంబంధించి సంచలనాత్మక ప్రకటన చేశారు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్కు చెందిన 10 ఫైటర్ జెట్లను సమర్థవంతంగా ధ్వంసం చేశామని, ఇందులో అధునాతన ఎఫ్-16, జేఎఫ్-17 వంటి యుద్ధ విమానాలు ఉన్నాయని ఆయన ప్రకటించారు. శత్రువుల స్థావరాలపై సుమారు 300 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను కూడా భారత సైన్యం కచ్చితత్వంతో ఛేదించిందని తెలిపారు.
ఆపరేషన్ సిందూర్లో భారీ నష్టం
ఏపీ సింగ్ మాట్లాడుతూ త్రివిధ దళాల సమన్వయంతో చేపట్టిన ఆపరేషన్ సిందూర్, పాకిస్తాన్కు భారీ నష్టాన్ని కలిగించింది. ఉగ్ర స్థావరాలు, రాడార్ వ్యవస్థలు, కమాండ్ & కంట్రోల్ సెంటర్లు, రన్వేలు, హ్యాంగర్లు వంటి కీలక సైనిక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఐదు ఎఫ్-16 , ఐదు జేఎఫ్-17 ఫైటర్ జెట్లతో సహా మొత్తం 10 పాక్ యుద్ధ విమానాలను కూల్చివేశామని ఆయన ధృవీకరించారు. భారత దళాల సమన్వయం , తక్షణ చర్యల ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని, దీనిని ప్రపంచ దేశాలు గమనించి నేర్చుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
పాక్ 'కాళ్ల బేరం': కాల్పుల విరమణ విజ్ఞప్తి
భారత సైన్యం దాడుల తీవ్రత కారణంగానే పాకిస్తాన్ కాల్పుల విరమణకు 'కాళ్ల బేరం'కు వచ్చిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్పష్టం చేశారు. పాక్ విజ్ఞప్తి మేరకు మాత్రమే భారత్ ఆ విరమణకు అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ మళ్లీ దుస్సాహసానికి ఒడిగడితే, 'చావుదెబ్బ తగలించే వరకూ' భారత సైన్యం ప్రతిస్పందన ఉంటుందని గట్టి హెచ్చరిక జారీ చేశారు.
'సుదర్శన చక్ర మిషన్' - దేశ భద్రతకు స్వదేశీ కవచం
దేశ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా, 'సుదర్శన చక్ర' అనే కీలక ఆవిష్కరణకు ఏపీ సింగ్ సంకేతం ఇచ్చారు. ఈ మిషన్ ద్వారా దేశంలోని ముఖ్యభాగాల భద్రతను పెంపొందించి, భారత్ను శత్రు దుర్బేధ్యంగా తయారుచేయడం లక్ష్యం. త్రివిధ దళాల సహకారంతో ఈ కొత్త భద్రతా వ్యవస్థపై పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, 2035 నాటికల్లా ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడుతుందని వివరించారు.
ఈ వివరాలు, ఆపరేషన్ సిందూర్ కేవలం వ్యూహాత్మక విజయమే కాక, ప్రపంచానికి భారత సైనిక శక్తిని చాటిచెప్పిన చారిత్రక విజయం అని ఏపీ సింగ్ పేర్కొన్నారు. ఈ విజయానికి ప్రభుత్వ నిర్ణయం, దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపారు.
