బెడ్, టాయిలెట్, మైక్రోవేవ్ ఓవెన్... బాంబులతో ఎగిరే హోటల్ తెలుసా?
ఈ దాడుల్లో ప్రధానంగా 14 బంకర్ బ్లాస్టర్ బాంబులను వాడినట్లు అమెరికా వెల్లడించింది. వీటితో ప్రధానంగా ఫోర్డోతో పాటు ఇస్ఫహాన్, నతాంజ్ అణు కేంద్రాలపై విరుచుకుపడింది.
By: Tupaki Desk | 23 Jun 2025 10:40 PM ISTపశ్చిమాసియాలో ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారి స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:40 గంటలకు ఇరాన్ లోని మూడు అణుకేంద్రాలపై దాడులు మొదలుపెట్టి 7:05 గంటలకు అంటే.. 25 నిమిషాల్లో పని పూర్తి చేసింది. దీనికి 'ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్' గా నామకరణం చేసింది.
ఈ దాడుల్లో ప్రధానంగా 14 బంకర్ బ్లాస్టర్ బాంబులను వాడినట్లు అమెరికా వెల్లడించింది. వీటితో ప్రధానంగా ఫోర్డోతో పాటు ఇస్ఫహాన్, నతాంజ్ అణు కేంద్రాలపై విరుచుకుపడింది. ఇదే క్రమంలో సుమారు 30 తోమహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ సమయంలో బంకర్ బ్లస్టర్ బాంబులను మోసుకెళ్లిన బీ-2 స్పిరిట్ పై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అవును... బీ-2 స్పిరిట్ ఐదో తరం స్టెల్త్ బాంబర్. ఇది మొట్టమొదటిసారిగా 1989లో ఎగిరింది. అనంతరం 1999లో కొసావో యుద్ధం సమయంలో ఫస్ట్ టైమ్ కార్యచరణలో మొహరించబడింది. సుదూర ప్రాంతాల్లోని మిషన్ల కోసం దీన్ని ఎంపిక చేస్తారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనేది 2001 తర్వాత బీ-2 స్పిరిట్ చేపట్టిన సుదూర ఆపరేషనల్ స్ట్రైక్ అని అంటున్నారు.
అంతకంటే ముందు 2001లో 9/11 దాడుల తర్వాత బీ-2 స్పిరిట్.. దాని నివాసమైన వైట్ మన్ వైమానిక దళ స్థావరం నుండి ఆఫ్ఘనిస్తాన్ లో 44 గంటల పాటు కొనసాగిన ఒక మిషన్ కోసం బయలుదేరింది. ఇది దాని చరిత్రలోనే అతి పొడవైన ప్రయాణం. ఈ క్రమంలో.. అప్పుడైనా, ఇప్పుడైనా మార్గమధ్యలో గాల్లోనే పలుమార్లు ఇంధనం నింపుకుంటూ దూసుకుపోతుంది.
ఈ క్రమంలో.. దీన్ని స్టెల్త్ బాంబర్ బాంబులతో ఎగిరే హోటల్ లాంటిదని అంటున్నారు. ఇందులో భాగంగా... ఈ బీ-2 స్పిరిట్ లో మైక్రోవేవ్ ఒవెన్ లు, స్నాక్స్ తో నిండిన రాక్ లు ఉంటాయి. వీటిలో మిల్లెట్స్, క్యాండీ బార్స్, శాండ్ విచ్ లు, పాలు, డ్రింక్స్ ఉంచుతారు. సుదూర మిషన్స్ నేపథ్యంలో ఇందులో విశ్రాంతి గదులు, టాయిలెట్లు ఏర్పాటు చేయబడి ఉన్నాయి.
ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ కోసం...!:
తాజాగా ఇరాన్ పై చేపట్టిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ కోసం ఏడు బీ-2 స్పిరిట్ బాంబర్లను రంగంలోకి దింపారు. వీటీలో ఒక్కోదానిలో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. అవి మిస్సోరి నుండి బయలుదేరి తూర్పు వైపు ముందుకు సాగాయి. టార్గెట్ దిశగా 18 గంటల పాటు ప్రయాణించిన సమయంలో.. విమానం చెక్ పాయింట్ల వద్ద ఇప్పటికే ఉన్న కేసీ-135 / లేదా కేసీ-46 ట్యాంకర్లతో ఇంధనం నింపుకుంది.
ఈ క్రమంలో ఇరాన్ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 2:10 గంటలకు, బీ-2 విమానం ఫోర్డో వద్ద ఉన్న అనేక టార్గెట్ పాయింట్లలో మొదటి దానిపై రెండు జీబీయూ-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ (ఎంవోపీ) ఆయుధాలను జారవిడిచింది. అనంతరం మిగిలిన బాంబర్లు కూడా తమ లక్ష్యాలను చేధించాయి. ఇలా మొత్తం 14 ఎంవోపీ అణు కేంద్రాలపై పడవేశారు. పని పూర్తి చేసి తిరిగి వచ్చేశారు!
