Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ గేమ్స్ లో అతివల హస్తం అదుర్స్... ఎంత బిజినెస్సో తెలుసా?

సాధారణంగా సినిమాల్లో అయినా, ఇళ్లల్లో అయినా ఫోన్స్ పట్టుకుని కనిపిస్తే అబ్బాయిలకు గట్టిగా పడిపోతుంటాయి.

By:  Tupaki Desk   |   4 Nov 2023 9:46 AM GMT
ఆన్  లైన్  గేమ్స్  లో అతివల హస్తం అదుర్స్... ఎంత బిజినెస్సో తెలుసా?
X

సాధారణంగా సినిమాల్లో అయినా, ఇళ్లల్లో అయినా ఫోన్స్ పట్టుకుని కనిపిస్తే అబ్బాయిలకు గట్టిగా పడిపోతుంటాయి. అస్తమానం ఫోన్ పట్టుకుని ఉంటారని, అందులో ఆన్ లైన్ గేమ్స్ లో మునిగిపోతుంటారని తిడుతుంటారు ఇంట్లో పెద్దోళ్లు. ఇదే సమయంలో ఆ ఆన్ లైన్ గేమ్స్ లో లెవెల్స్ పెరిగే కొద్దీ స్ట్రెస్ పె రిగిపోతూ వాటిని నుంచి బయటపడటానికి కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారని అంటుంటారు.

ఈ విషయంలో అమ్మాయిలు ఆల్ మోస్ట్ సేఫ్ అనే మాటలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అబ్బాయిలు ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ సమయం వృధా చేస్తారని, అమ్మాయిలు మాత్రం అలాంటి ఆలోచనే చేరని చెబుతుంటారు. అయితే ఇది పూర్తిగా వాస్తవం కాదని, ఏమాత్రం నిజం కాదు అని... ఆన్ లైన్ గేమ్స్ విషయంలో అమ్మాయిలు కూడా తగ్గేదేలే అంటున్నారని తాజాగా వివరాలు వెలుగులోకి వచ్చాయి.

అవును... దేశంలోని ఆన్ లైన్ గేమర్స్ లో మహిళలు ఎక్కువగా ఉన్నట్టు లుమికాయ్ అనే గేమింగ్ కంపెనీ వెల్లడించింది. ఇందులో భాగంగా 41 శాతం మంది మహిళలు ప్రస్తుతం ఆన్ లైన్ గేమర్స్ గా ఉన్నారని సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో... ఆన్ లైన్ గేమింగ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది!

ఇలా ఇండియాలో ఆన్ లైన్ గేమర్స్ లో మహిళలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించిన లుమికాయ్... ఈ దేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న వాళ్లలో 50 శాతం మంది గేమ్స్ ఆడుతున్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో... ప్రతి వ్యక్తి గేమింగ్ లో గడిపే సమయం 20 శాతం పెరిగిందని, వారానికి సుమారు 10-12 గంటలు అదనంగా గేమ్స్ ఆడుతున్నారని వెల్లడించింది.

ఫలితంగా... ఇండియాలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ సంఖ్య 12 శాతం పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. అదేవిధంగా... ఇండియాలో గేమ్స్ ఆడుతున్న వ్యక్తుల్లో 59శాతం మంది పురుషులైతే, 41శాతం మంది మహిళలున్నారని వెల్లడించింది. వీళ్లలో 18 -30 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లే ఎక్కువమంది కాగా... గేమర్స్ లో 66శాతం మంది నాన్ మెట్రో ప్రాంతాలనుంచి ఉండడం గమనార్హం.

ఇక దేశంలో ఆన్ లైన్ గేమ్స్ ద్వార జరుగుతున్న వ్యాపారం కూడా భారీస్థాయిలో అభివృద్ధి చెందుతుందని సదరు కంపెనీ వెల్లడించింది. ఇందులో భాగంగా... గత ఆర్థిక సంవత్సరంలో (2022-23)లో దేశీయ గేమింగ్‌ మార్కెట్‌ విలువ 310 కోట్ల డాలర్లు ఉందని తెలిపింది. ఇదే సమయంలో... 2027-28 నాటికి ఈ విలువ 750 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.62,250 కోట్లకు) చేరుకుంటుదని లుమికాయ్‌ తన తాజా నివేదికలో పేర్కొంది.

ఇదే క్రమంలో... భారత గేమింగ్‌ మార్కెట్‌ అంతర్జాతీయంగా అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉందని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని ఇండియా గేమ్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ (ఐజీడీసీ) వెల్లడించింది.