Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ‘ఓఎన్ డీసీ’

కొద్ది నెలల క్రితం మొదలైన ఈ సేవలు తాజాగా హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:07 AM GMT
హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ‘ఓఎన్ డీసీ’
X

ఏమిటీ ‘ఓఎన్ డీసీ’ సేవలు? అన్న సందేహం వస్తుంది కదా? సింఫుల్ గా చెప్పేస్తే.. మనకు క్యాబ్ అవసరమైనా.. బైక్ సేవలు కావాల్సి వచ్చినా.. నచ్చిన ఫుడ్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకోవటం మామూలే. వీటన్నింటికి కొన్ని యాప్ ల ద్వారా సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ యాప్ సేవల్ని వినియోగించటం ద్వారా వారు సర్వీస్ ఛార్జి..ప్యాకింగ్.. ఇంటర్నెట్ హ్యాండిలింగ్ ఛార్జీలతో పాటు.. డిమాండ్ వేళ సర్జ్ పేరుతో బాదేయటం.. మరో మార్గం లేక ఓకే చేసేయటం అందరికి అలవాటుగా మారింది. ఇందుకు భిన్నంగా అలాంటి భారం లేకుండా ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకనేందుకు వీలు కల్పించే సర్వీసే ఈ ‘ఓఎన్ డీసీ’ (ఓపెన్ నెట్ వర్కు ఫర్ డిజిటల్ కామర్స్)గా చెప్పాలి.

కొద్ది నెలల క్రితం మొదలైన ఈ సేవలు తాజాగా హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రారంభించిన ఈ వేదికను డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నేత్రత్వంలో వినియోగదారులకు సరసమైన ధరల్లో వస్తు సేవలు అందేలా చూడటమే దీని లక్ష్యం. మామూలు యాప్ లో అయితే.. వినియోగదారులు ఒక చోట ఉంటారు. వారికి నచ్చిన ఫుడ్ ను.. కోరుకున్న రెస్టారెంట్ నుంచి ఒకయాప్ ద్వారా ఎంపిక చేసుకొని బుక్ చేసుకుంటారు.

అంటే.. ఈ వ్యవహారంలో యాప్ ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. ఈ మధ్యవర్తి కోరినట్లుగా చెల్లించాల్సిన బాధ్యత వినియోగదారుడి మీద ఉంటే.. సదరు యాప్ తాను సర్వీసు ఇచ్చినందుకు ఆర్డర్ చేసే వ్యక్తి నుంచే కాదు.. ఆర్డర్ వచ్చిన హోటల్ నుంచి కూడా సర్వీసు ఛార్జి వసూలు చేస్తుంది. ఈ కొత్త విధానంలో ఆ మొత్తం కనీస స్థాయిలో ఉండేలా చూడటమే లక్ష్యం.

ఒక లెక్క ప్రకారం చికెన్ బిర్యానీ మామూలుగా రూ.300 అయితే.. యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే అన్ని ఖర్చులు కలుపుకొని రూ.350 నుంచి రూ.370 వరకు చెల్లించాల్సి వస్తుంది. ఈ కొత్త ప్లాట్ ఫాంలో మాత్రం రూ.320 చెల్లిస్తే సరి. ఇప్పటికే ఈ తరహా సేవల్ని కోల్ కతా.. బెంగళూరు.. కొచ్చి.. మైసూరు నగరాల్లో 1.15 లక్షల మంది డెలివరీ బాయ్స్ తో ఈ వేదిక పని చేస్తుంది. తాజాగా హైదరాబాద్ ప్రజలకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. అంతా బాగుంది కానీ.. ఈ సేవలుకావాలంటే ఎలా ఆర్డర్ చేయాలంటే.. యూపీఐ ద్వారా కానీ.. పేటీఎం ద్వారా కానీ ఈ సేవల్ని పొందొచ్చు. ఈ నెట్ వర్కుకు హైదరాబాద్ కు చెందిన 25వేల మంది డెలివరీ బాయిలు అనుసంధానమైనట్లు చెబుతున్నారు.

తెలంగాణ గిగ్ వర్కర్స్ అసోసియేషన్ కు చెందిన డెలివరీ బాయిస్ ఈ నెట్ వర్కుకు అనుసంధానం అయినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో దగ్గర దగ్గర 15 వేల రెస్టారెంట్లు ఉండగా.. ఏటా కోటికి పైగా బిర్యానీలు అమ్ముడు పోతున్నాయి. ఒక అంచనా ప్రకారం ఆన్ లైన్ ద్వారా రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో అటు కస్టమర్ కు.. ఇటు రెస్టారెంట్లకు ఎక్కువ భారం కాకుండా ఈ కొత్త వేదిక ఉంటుందని చెబుతున్నారు. సో.. ఒకసారి ట్రై చేయండి.