ఎంతో మంది ఉండగా.. ఎన్టీఆర్కే ఆ కీర్తి ఎలా దక్కింది..!
కొందరైతే.. తమ ఆస్తులకు తోడు.. తమ మిత్రులను కూడా ప్రోత్సహించి ప్రజల సేవలకు ఆస్తులను కేటాయించేలా చేసిన వారు ఉన్నారు.
By: Tupaki Desk | 28 May 2025 6:52 AMఈ ప్రశ్న తరచుగా వినిపిస్తూనే ఉంటుంది. యుగ పురుషుడు, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దశ దిశలా వ్యాపించిన మహనీయుడు అంటూ.. ఎన్టీఆర్ను కీర్తించడం.. ఆయనను స్మరించుకోవడం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ కీర్తి ఆయనకు మాత్రమేఎందుకు దక్కింది? ఎలా దక్కింది? అనేది ప్రశ్న. నిజానికి అప్పటికి 1980ల నాటికి ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయాల్లో ఉన్న అనేక మంది ప్రముఖులు నిస్వార్థంగానే పనిచేశారు.
మరో మాటలో చెప్పాలంటే.. ఇప్పుడున్న నాయకుల మాదిరిగా అప్పట్లో ఆస్తులు పోగేసుకున్న నాయకుల కంటే కూడా.. ఉన్న ఆస్తులను ప్రజలకు పంచేసిన నాయకులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో టంగుటూరి ప్రకాశం పంతులు, చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, మండలి కృష్ణారావు, పేర్ని వెంకట రామయ్య సహా అనేక మంది నాయకులు తమ ఆస్తులను కరిగించుకుని ప్రజా సేవ చేశారు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం.
కొందరైతే.. తమ ఆస్తులకు తోడు.. తమ మిత్రులను కూడా ప్రోత్సహించి ప్రజల సేవలకు ఆస్తులను కేటాయించేలా చేసిన వారు ఉన్నారు. మరి అలాంటి వారికి దక్కని కీర్తి కూడా ఎన్టీఆర్ కు ఎలా దక్కింద న్నది ప్రశ్న. దీనికి అప్పటి తరం నాయకులు కొందరు.. చెబుతున్న మాట.. ఎన్టీఆర్కు ముందున్న నాయకులకు, ఎన్టీఆర్కు తేడా కేవలం తెలుగు ప్రజల కోసం చేసిన పోరాటం. మిగిలిన వారు.. ప్రజల కంటే కూడా.. ఢిల్లీని మెప్పించే పనులు చేపట్టారన్నది ప్రధాన అంశం.
అంటే.. ఢిల్లీ కనుసన్నల్లో మెలిగి.. అప్పటి ఏకఛత్రాధిపత్య రాజ్యాధికారాన్ని తెరమీదికి తెచ్చిన ఇందిర మ్మకు దోసిలొగ్గారని అంటారు. కానీ, ఎన్టీఆర్ తన ఆస్తులను ప్రజలకు పంచకపోయినా.. తెలుగు వారి ఆత్మాభిమానం పేరుతో ఆయన ఉత్తుంగ తరంగంగా మారి.. ప్రజల మధ్యకు రావడం.. ఆయన సినీ గ్లామర్.. మార్పు కోరుకుంటున్న మధ్యతరగతిని , మహిళలను ఆకర్షించడం వల్లే ఇదంతాసాధ్యమైందని చెబుతారు. అందుకే.. నేటికీ ఆయన కీర్తిచిరస్థాయిగా నిలిచిపోయిందని చెబుతారు.