దేశంలోనే అతిపెద్ద విగ్రహం.. అమరావతిలో 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహానికి రంగం సిద్ధం
దేశంలోనే అతిపెద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మించడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ప్రతి తెలుగువాడి అన్నగా కీర్తి గడించిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చరిత్రను పదికాలాలు గుర్తుంచుకునేలా భారీ చిరస్మరణీయ చిహ్నం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.
By: Tupaki Desk | 23 April 2025 5:50 AMదేశంలోనే అతిపెద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మించడానికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ప్రతి తెలుగువాడి అన్నగా కీర్తి గడించిన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చరిత్రను పదికాలాలు గుర్తుంచుకునేలా భారీ చిరస్మరణీయ చిహ్నం ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో గుజరాత్ లోని అతిపెద్ద విగ్రహం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కంటే ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కోరుతూ కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు ఆహ్వానించింది.
అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) ఆధ్వర్యంలో రాజధాని పరిధిలోని నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల క్రితం మున్సిపల్ మంత్రి నారాయణ, సీఆర్ఢీఏ కమిషనర్ కన్నబాబు, ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారథి గుజరాత్ పర్యటనలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. అమరావతిలో కూడా ఇదే విధమైన విగ్రహాల ఏర్పాటు కోసం అధ్యయనం చేస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం డీపీఆర్ తయారీకి టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. డీపీఆర్ సిద్ధమవగానే ఎన్టీఆర్ విగ్రహం ఎత్తుపై పూర్తి స్పష్టత రానుంది.
ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 600 అడుగులు ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రతిపాదిస్తోందని అంటున్నారు. ఇందులో నీరుకొండ ఎత్తు 300 అడుగులు ఉంటుంది. దీని మీద 100 అడుగుల ఎత్తులో బేస్ ను నిర్మించాల్సివుంటుందని చెబుతున్నారు. ఈ బేస్ లోనే ఎన్టీఆర్ మ్యూజియం, మెమోరియల్ హాల్, ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెలియజేసే కళారూపాలు, మినీ థియేటర్, కన్వెన్షన్ హాల్ ఉంటాయి. ఈ బేస్ పైన 200 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తారు.
విగ్రహం పాదాల చెంతకు వెళ్లడానికి ఎస్కటేటర్ లేదా లిప్ట్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విగ్రహం తయారైతే దేశంలోనే అతిపెద్ద విగ్రహాల్లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. దేశంలో అతిపెద్ద విగ్రహంగా ప్రస్తుతం గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంది. దీని ఎత్తు సుమారు 597 అడుగుల ఎత్తు. దేశంలో ఐక్యతకు చిహ్నంగా పటేల్ విగ్రహం నిర్మించిన ప్రదేశానికి యూనిటీ ఆఫ్ స్టాట్యూగా పేరు పెట్టారు. అయితే ఆ విగ్రహం కన్నా ఎత్తుగా ఎన్టీఆర్ విగ్రహం ఉంటుందా? లేదా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.