Begin typing your search above and press return to search.

పెట్రోల్ , డీజిల్ ధరల పెంపుపై కేంద్రం సంచలన ప్రకటన

డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల విషయంలో కూడా స్పష్టత ఇచ్చారు. వంటగ్యాస్ ధరలు పెరుగుతాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రం తెలిపింది.

By:  A.N.Kumar   |   1 April 2026 10:08 PM IST
పెట్రోల్ , డీజిల్ ధరల పెంపుపై కేంద్రం సంచలన ప్రకటన
X

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌లో కూడా ఇంధన ధరలు పెరుగుతాయన్న వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే ఈ ప్రచారాలకు చెక్ పెడుతూ కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీ ధరలను పెంచే ఉద్దేశం లేదని ఖచ్చితంగా తెలిపింది.

పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మీడియాతో మాట్లాడిన సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని.. కనీసం రెండు నెలలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా రిఫైనరీలు గరిష్ఠ సామర్థ్యంతో పనిచేస్తున్నాయని.. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపారు. ప్రజలు అనవసర భయాలకు లోనై అధికంగా ఇంధనం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ‘ప్యానిక్ బుకింగ్’ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. రెండు నెలల క్రితం బ్యారెల్ ధర సుమారు 70 డాలర్ల వద్ద ఉండగా ప్రస్తుతం అది 100 డాలర్ల మార్కును దాటింది. అయినప్పటికీ దేశీయ వినియోగదారులపై అదనపు భారం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. వినియోగదారులపై ప్రభావం తగ్గించేందుకు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినట్లు వివరించారు.

డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల విషయంలో కూడా స్పష్టత ఇచ్చారు. వంటగ్యాస్ ధరలు పెరుగుతాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రం తెలిపింది. దేశంలో ఎల్పీజీ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. అవసరమైతే భవిష్యత్తులో సరఫరా అంతరాయాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత ప్రభుత్వం పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తోందని, ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు గందరగోళానికి గురికావద్దని, అధికారిక ప్రకటనలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.

మొత్తం మీద పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపు అంశంపై వస్తున్న పుకార్లకు కేంద్రం తుదిచెప్పింది. ప్రస్తుతం దేశంలో ఇంధన కొరత లేదని, ధరలు పెంచే యోచన కూడా లేదని స్పష్టం చేస్తూ ప్రజలకు భరోసా కల్పించింది.