నేపాల్ లో లూటీ.. రాజ్యాంగాన్ని తిరిగిరాస్తేనే శాంతి.. నేపాల్లో యువత డిమాండ్లు
సెప్టెంబర్ 4, 2025న నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా యాప్లను నిషేధించడంతో నిరసనలకు బీజం పడింది. అయితే అసలు కారణం ఇదే కాదు.
By: Tupaki Desk | 10 Sept 2025 4:08 PM ISTనేపాల్ ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కేవలం సోషల్ మీడియా నిషేధం కారణంగా మొదలైన నిరసనలు, ఇప్పుడు మూడు దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతి, రాజకీయ వారసత్వం, నిరుద్యోగం వంటి సమస్యలపై యువత ఆగ్రహాన్ని బయటపెట్టాయి. ఈ సంక్షోభం నేపాల్ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది.
సంక్షోభం ఎలా మొదలైంది?
సెప్టెంబర్ 4, 2025న నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా యాప్లను నిషేధించడంతో నిరసనలకు బీజం పడింది. అయితే అసలు కారణం ఇదే కాదు. దేశంలో కొనసాగుతున్న రాజకీయ అవినీతి, యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, దీంతో విదేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు వంటివి జనరేషన్ Z యువతను ఆగ్రహానికి గురి చేశాయి. ఈ ఆగ్రహం సెప్టెంబర్ 8న కాఠ్మాండూ వీధుల్లో భారీ నిరసనలుగా మారి, పోలీసులు రబ్బరు బుల్లెట్లు, వాటర్ కెనన్, టియర్ గ్యాస్ వాడినా తగ్గలేదు. ఈ నిరసనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సాయంత్రం ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధాన్ని వెనక్కి తీసుకున్నా, ఆందోళనలు ఆగలేదు.
హింసాత్మక నిరసనలు, ప్రభుత్వ రాజీనామా
సెప్టెంబర్ 9న నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. నిరసనకారులు పార్లమెంట్, సుప్రీం కోర్టు వంటి ప్రభుత్వ భవనాలపై దాడులు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి రాజీనామా చేసి ఆర్మీ క్యాంప్లో తలదాచుకున్నారు. అధికారికంగా 23 మంది మరణం, 347 మందికి పైగా గాయపడినట్లు ప్రకటించారు. నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రజలు మాల్స్, షోరూమ్లలోకి దూసుకెళ్లి టీవీలు, ఫ్రిజ్లు వంటి వస్తువులను లూటీ చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చివరికి నేపాల్ ఆర్మీ రంగంలోకి దిగింది.
* యువత డిమాండ్లు, ఆర్మీ హెచ్చరిక
*ఈ నిరసనల్లో యువత ప్రధానంగా కొన్ని డిమాండ్లను ముందుంచింది.
*నిరసనల్లో మరణించిన వారిని అమరులుగా గుర్తించడం, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలి.
*నిరుద్యోగం, సామాజిక అన్యాయంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.
*కొత్త రాజకీయ వ్యవస్థ ఏర్పాటు.
రాజ్యాంగ పునర్రచన.
యువత డిమాండ్లు ఏ పార్టీకి చెందినవి కావు, ఇది కేవలం వారి భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటంగా వారు చెబుతున్నారు.
ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ శాంతియుత చర్చలకు పిలుపునిచ్చారు. అయితే, విధ్వంసాలు కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ట్రిభువన్ విమానాశ్రయం, పార్లమెంట్ భవనం వంటి కీలక కేంద్రాలను ఆర్మీ నియంత్రణలోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది.
పాత తరం VS కొత్త తరం
నేపాల్లో ప్రతి తరం ఒక రాజకీయ పోరాటం చేసింది. 1990లో ప్రజాస్వామ్యం కోసం, 2007లో రాచరికం అంతం కోసం పోరాడారు. ఇప్పుడు, 2015లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగం తమకు అనుకూలంగా లేదని, అది కేవలం రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసమేనని Gen Z యువత వాదిస్తోంది. అందుకే పాత రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ కొత్త తరం తిరుగుబాటు చేసింది. ఈ సంక్షోభానికి కేవలం శాంతియుత పరిష్కారం సరిపోదని, కొత్త రాజ్యాంగం పునాదుల మీద మాత్రమే శాంతి సాధ్యమని యువత గట్టిగా నమ్ముతోంది.
