Begin typing your search above and press return to search.

మంత్రుల‌కు మోడీ మార్క్ క్లాస్

త‌ర‌చూ కేంద్ర మంత్రివ‌ర్గం స‌మావేశం అవుతున్న‌ప్ప‌టికి.. నిన్న (శుక్ర‌వారం) జ‌రిగిన కేంద్ర కాబినెట్ భేటీపై పెద్ద ఎత్తున ఆస‌క్తి వ్య‌క్త‌మైంది.

By:  Garuda Media   |   23 May 2026 10:00 AM IST
మంత్రుల‌కు మోడీ మార్క్ క్లాస్
X

త‌ర‌చూ కేంద్ర మంత్రివ‌ర్గం స‌మావేశం అవుతున్న‌ప్ప‌టికి.. నిన్న (శుక్ర‌వారం) జ‌రిగిన కేంద్ర కాబినెట్ భేటీపై పెద్ద ఎత్తున ఆస‌క్తి వ్య‌క్త‌మైంది. ప‌లువురు మంత్రుల‌ను ఇంటికి పంపి.. కొత్త బ్ల‌డ్ ను మంత్రివ‌ర్గంలోకి తీసుకురానున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. అందుకు త‌గ్గ‌ట్లే.. మోడీ నాయ‌క‌త్వంలో నిర్వ‌హించిన మంత్రివ‌ర్గ భేటీలో ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన అనూహ్య ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర‌మంత్రులు ప‌లువురు నోట మాట రాని విధంగా ఉండిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. రీల్స్ తెలుసా? మీలో ఎంద‌రికి ఇన్ స్టా అకౌంట్ ఉందంటూ ఆయ‌న ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌టంతో అందుకు ప్ర‌తిగా ఉక్కిరిబిక్కిరి కావ‌టం కేంద్ర‌మంత్రుల వంతైన‌ట్లుగా తెలుస్తోంది.

మీ గురించి కానీ.. మీరు చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల గురించి కానీ.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల గురించి కానీ ఎప్పుడైనా రీల్స్ లో ప్ర‌చారం చేశారా? అన్న ప్ర‌శ్నను చూస్తే.. మారిన కాలానికి.. అందుకు త‌గ్గ‌ట్లు మారుతున్న ప్ర‌జ‌ల అభిరుచికి త‌న సొంత టీంలోని ఎంద‌రు అప్డేట్ అయ్యార‌న్న విష‌యాన్ని ప్ర‌ధాని మోడీ చెక్ చేసిన‌ట్లుగా చెప్పాలి. ఓవైపు కాక్రోచ్ జ‌న‌తాపార్టీ సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారిన వేళ‌లోనే.. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ నోటి నుంచి వ‌చ్చిన తాజా ప్ర‌శ్న‌లు కేంద్ర‌మంత్రుల‌కు షాకింగ్ గా మారిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇటీవ‌ల కాలంలో జెన్ జీ.. యూత్ ప్ర‌భావాల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ.. మంత్రుల‌కు క్లాస్ తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. తాజా కాబినెట్ భేటీని చూస్తే.. అప్డేటెడ్ మోడీకి.. పాత కాలంలో ఉండిపోయిన కొంద‌రు మంత్రుల మ‌ధ్య తేడా భారీగా క‌నిపించిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదే సంద‌ర్భంగా జెన్ జీ పార్టీకి వ్య‌తిరేకంగా ఉన్నారంటూ జ‌రిగే ప్ర‌చారంలో నిజం లేద‌న్న విష‌యాన్ని ప్ర‌ధాని మోడీ స్ప‌ష్టం చేయ‌ట‌మే కాదు.. త‌న వాద‌న‌లోని లాజిక్ ను వివ‌రంగా చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ బెంగాల్ లో మమ‌తా బెన‌ర్జీ పార్టీని ఓడించి.. బీజేపీ గెలుపులో జెన్ జీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని.. వారంతా త‌మ‌తోనే ఉన్నార‌న్న విష‌యాన్ని మోడీ ప్ర‌స్తావంచిన‌ట్లుగా స‌మాచారం. అందుకే.. కేంద్రం చేసే ప‌నుల గురించి చెప్పుకునేందుకు యువ‌త వ‌ద్ద‌కు వెళ్లాల‌న్న హిత‌బోధ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. యువ‌త (18-30ఏళ్లు)ను సంతృప్తి ప‌రిచేందుకు ఏం చేయాల‌న్న కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌న్న విష‌యాన్ని మోడీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించిన‌ట్లుగా తెలుస్తోంది.

యువ‌త ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లు మంత్రులు త‌మ ప‌ని తీరును మార్చుకోవాల్సి ఉంటుంద‌ని చెప్ప‌ట‌మే కాదు.. అందుకు త‌గ్గ‌ట్లు మార‌కుంటే మంత్రులు త‌మ స్థానాల్ని కోల్పోవాల్సి వ‌స్తుంద‌న్న వ్యాఖ్య చేసిన‌ట్లుగా స‌మాచారం. అంతేకాదు.. ఇప్ప‌టి యువ‌త గ‌తంలో మాదిరి న్యూస్ పేప‌ర్లు చ‌ద‌వ‌టం లేద‌ని.. టీవీలు చూడ‌టం లేద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. సోష‌ల్ మీడియాలో మునిగి తేలుతున్న‌ట్లుగా ప్ర‌ధాని మోడీ పేర్కొన్న‌ట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయా వ‌ర్గాల్ని ఆక‌ర్షించేందుకు వీలుగా అన్ని ప్ర‌య‌త్నాలు చేయాల్సి ఉంటుంద‌న్నారు. తాజా మంత్రివ‌ర్గ భేటీ రోటీన్ కు కాస్తా భిన్నంగా జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌ధాని మోడీ వ్యాఖ్య‌ల తీరు చూస్తుంటే..త్వ‌ర‌లో యంగ్ బ్ల‌డ్ కేంద్ర మంత్రివ‌ర్గంలోకి వ‌స్తాయ‌న్న వాద‌న‌కు మ‌రింత బ‌లం చేకూరేలా ఉన్న‌ట్లు చెబుతున్నారు. మ‌రి.. మోడీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.