Begin typing your search above and press return to search.

దేశం కోసం... యువతకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఒకే ఒక్క సలహా ఇది!

ఏ దేశానికికైనా యువతే వెన్నెముక అంటారు. యువత తలచుకుంటే ఆ దేశపురోభివృద్ధి అత్యంత వేగంగ ఉంటుందని చెబుతుంటారు

By:  Tupaki Desk   |   27 Oct 2023 3:53 AM GMT
దేశం కోసం... యువతకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఒకే ఒక్క సలహా ఇది!
X

ఏ దేశానికికైనా యువతే వెన్నెముక అంటారు. యువత తలచుకుంటే ఆ దేశపురోభివృద్ధి అత్యంత వేగంగ ఉంటుందని చెబుతుంటారు. ఈ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశం భారత్‌ అనేది తెలిసిన విషయమే. భారత జనాభాలో సుమారు 65 శాతం 28 సంవత్సరాల లోపు వారే అని వర్క్‌ ఫోర్స్‌ లెక్కలు చెబుతున్నాయి. ఆ మాటకు వస్తే.. 45 శాతం జనాభా 25 సంవత్సరాల లోపు వారే!

దీంతో... భారత్‌ భవిష్యత్తును మార్చడంలో యువత క్రియాశీలకంగా మారనున్నారని స్పష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీరంతా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలంటే... భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే యువత అంతా ఒక పని చేయాలని అంటున్నారు ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. ఆ టైంపులో యువతలో కృషి, పట్టుదల ఉంటే... ఇక భారతదేశానికి తిరుగుండదని చెబుతున్నారు.

అవును... ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్‌ లోని యువత ఒకపని చేయాలని సూచిస్తున్నారు ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి. ఇందులో భాగంగా... యువత వారానికి 70 గంటల పాటు పనిచేస్తే అప్పుడు అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ నిలవలగలదని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి మరింత వివరణ ఉదాహరణలతో సహా ఇచ్చారు.

తాజాగా ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌ఓ మోహన్‌ దాస్‌ పాయ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 3వన్‌4 క్యాపిటల్‌ తొలి పాడ్‌ కాస్ట్‌ "ది రికార్డ్‌" అనే ఎపిసోడ్‌ లో నారాయణమూర్తి మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణం, టెక్నాలజీ, ఇన్ఫోసిస్‌ సహా పలు అంశాల గురించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దేశం అభివృద్ధి చెందడానికి చేపట్టాల్సిన విషయాలపై స్పందించిన ఆయన... ఇందులో భాగంగా యువతకు ఈ సందేశం ఇచ్చారు.

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో చాలా తక్కువగా ఉన్న ఉత్పాదకత పెరగకుండా.. ప్రభుత్వంలో వేళ్లూనుకున్న అవినీతిని తగ్గించకుండా.. అధికార నిర్ణయాల్లో జాప్యం తొలగకుండా.. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడడం దాదాపు అససాధ్యం అని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో యువత ఒక ప్రతిజ్ఞత తీసుకోవాలని ఆయన సూచించారు.

ఇందులో భాగంగా... "యువత ఇదీ నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతాను" అనే ప్రతిజ్ఞ తీసుకోవాలని... రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్లు, జపానీయులు ఇదే పనిచేశారని నారాయణమూర్తి తెలిపారు. అదనపు గంటలు పనిచేయాలని ప్రతి జర్మన్‌ నిర్ణయించుకుని కొన్నేళ్ల పాటు ఆ పనిచేశారని.. ఫలితం ప్రపంచం మొత్తం చూసిందని గుర్తుచేశారు.

కాగా... 1939లో మొదలై 1945 వరకు సాగిన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, జపాన్ ల పరిస్థితి ఎలా ఉందేది.. ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలిసిన విషయమే. ఒక పండు పండని, ఒక పువ్వు పూయని, ఒక చుక్క మంచి నీరు దొరకని ప్రాంతాలుగా ఉన్న దేశాలు నేడు ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థలుగా మారాయి!

వాటితో పోలిస్తే అన్ని రకాల ప్రకృతి సంపదకు తోడు.. ఆరోగ్యవంతమైన యువత పుష్కలంగా ఉన్న భారత్ ఇంక ఎలాంటి స్టేజ్ లో ఉండాలి? అలా ఉండాలంటే ఏమిచేయాలనేదే మూర్తిగారు సూచించిన విషయం అన్నమాట!