Begin typing your search above and press return to search.

బ్రాహ్మణి బ్రహ్మాస్త్రమేనా...?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలులో గడుపుతున్నారు. ఆయన రిమాండ్ ఖైదీగానే ఉన్నారు.

By:  Tupaki Desk   |   17 Sep 2023 6:03 PM GMT
బ్రాహ్మణి బ్రహ్మాస్త్రమేనా...?
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జైలులో గడుపుతున్నారు. ఆయన రిమాండ్ ఖైదీగానే ఉన్నారు. బెయిల్ మీద కూడా ఆయన త్వరలో రావచ్చు. అయితే ఆయన మీద వరస కేసులు ఫైల్ చేసి మళ్లీ అరెస్ట్ చేసి జైలులో పెడితే సంగతేంటి అన్న చర్చ నడుస్తోంది. ఇక టీడీపీ లాంటి ప్రాంతీయ పార్టీలలో అధినేత చుట్టూనే రాజకీయాలు సాగుతాయి. ఆయన కాకపోతే ఆయన కుటుంబీకుల మీదనే పార్టీ ఆధారపడుతూ ఉంటుంది.

ఈ నేపధ్యంలో చంద్రబాబు పార్టీలో నంబర్ టూ ఎవరు అంటే ఇప్పటికే తేలని చిక్కు ప్రశ్నగానే ఉంది. లోకేష్ ఆయన వారసుడిగా ఇంకా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరో వైపు బావమరిది బాలయ్య చంద్రబాబు అరెస్ట్ తరువాత మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో బాబు గారు కూర్చునే సీట్లో కూర్చుని పవర్ ఫుల్ స్పీచ్ నే ఇచ్చారు.

నేను వస్తున్నా కాచుకోండి అంటూ వైసీపీకి సవాల్ చేశారు ఆ తరువాత చంద్రబాబును జైలులో ములాఖత్ ద్వారా పరామర్శించిన లోకేష్ పవన్ తో పాటు ఆయన కూడా ఉన్నారు. ఆ మీదట మాత్రం బాలయ్య కనిపించలేదు. నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళి పార్టీ ఎంపీలతో మీటింగ్స్ నిర్వహించారు. బాబు లేని వేళ ఆయనే వారికి దిశానిర్దేశం చేశారు. జాతీయ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఇంకో వైపు చూస్తే చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉంటే సమీపంలోనే నివాసం ఉంటున్నారు ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి. ఆమె ఎపుడూ టీడీపీ రాజకీయాల్లో పాలు పంచుకోలేదు. కానీ మొదటిసారి ఆమె మీడియా ముందుకు వచ్చారు. తన మామ సమర్ధవంతమైన నాయకుడు అని ఆయనను ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు అని ఆమె వైసీపీ ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు.

ఆ ఆరోపణలలో పసలేదని చెప్పడానికి తన ఎనిమిదేళ్ల కుమారుడు దేవాన్ష్ చాలు అంటూ సెటైర్లు వేశారు. టీడీపీకి ఆదరణ పెరుగుతోందని, తన మామ చంద్రబాబు, భర్త లోకేష్ జనంలో ఉంటున్నారని, వారికి లభిస్తున్న ఆదరణ చూసి వైసీపీ ప్రభుత్వం భయపడే ఈ అరెస్టులు చేస్తోందని అన్నారు. మొత్తానికి బ్రాహ్మణి నుంచి ఘాటు అయిన విమర్శలే వచ్చాయి.

ఇప్పటిదాకా ఏ రాజకీయ విమర్శలు చేయని ఆమె వైసీపీ సర్కార్ మీద గట్టిగానే విరుచుకుపడ్డారు. దీనిని బట్టి చూస్తూంటే రేపటి ఎన్నికల వేళ చంద్రబాబుకు తోడుగా ప్రచారం చేయడానికి బ్రాహ్మణి కూడా రంగంలో ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఆమె భర్త లోకేష్ ఎటూ రాజకీయాలలో ఉన్నారు కాబట్టి ఆమె కూడా మునుముందు టీడీపీలో యాక్టివ్ అవుతారా అన్నది మరో చర్చ. ఆమె నందమూరి వారి మూడవతరం వారసురాలు. ఎన్టీయార్ కి స్వయాన మనవరాలు. ఆమె మాటలకు జనాలు అట్రాక్ట్ అవుతారు. అందుకే నందమూరి బ్లడ్ అయిన బ్రాహ్మణినే ముందు ఉంచి ఈ కీలక సమయంలో ఆమె చేత వైసీపీకి వ్యతిరేకంగా విమర్శలు చేయిస్తున్నారు అంటున్నారు.

టీడీపీలో చంద్రబాబు కుటుంబీకులు ఎంతో మంది ఉన్నా బ్రాహ్మణి కి ఉన్న స్పెషాలిటీ వేరు. దాంతో ఆమెను రంగంలోకి దింపేందుకు బాబు అరెస్ట్ నేపధ్యాన్ని ఉపయోగించుకున్నారు అని అంటున్నారు. తెలుగుదేశం స్టార్ కాంపెయినర్ గా ఫ్యూచర్ లో బ్రాహ్మణి ఉంటారా అని కూడా చర్చ సాగుతోంది. అదే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆమె రేపటి ఎన్నికల్లో పోటీకి దిగుతారా అన్నది మరో ప్రశ్నగా ముందుకు వస్తోంది. ఏది ఏమైనా బ్రాహ్మణిని ఒక బ్రహ్మాస్త్రంగా ముందు పెట్టాలని టీడీపీ డిసైడ్ అయింది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.