Begin typing your search above and press return to search.

అన్న లేని లోటు తీర్చిన పవన్ అన్న.. లోకేశ్ ఎమోషనల్ స్పీచ్, జగన్‌పై స్ట్రాంగ్ కౌంటర్స్

కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం ‘‘రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం" పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు.

By:  Tupaki Political Desk   |   12 Jun 2026 2:46 PM IST
అన్న లేని లోటు తీర్చిన పవన్ అన్న.. లోకేశ్ ఎమోషనల్ స్పీచ్, జగన్‌పై స్ట్రాంగ్ కౌంటర్స్
X

కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం ‘‘రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం" పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా కూటమి అగ్రనేతలు హాజరైన ఈ సభలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగం సభలో ఊపు తెచ్చింది. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో ఘాటు విమర్శలు గుప్పిస్తూనే, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తనకున్న ఆత్మీయ బంధాన్ని పంచుకుని అందరినీ ఆకట్టుకున్నారు.

పవన్ అన్న అంటూ పొగడ్తలు

మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తనకున్న గౌరవాన్ని, అభిమానాన్ని బహిరంగంగా చాటుకున్నారు. "నాకు సొంత అన్న లేని లోటును పవన్ అన్న తీర్చారు" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత ఎన్నికల ముందు నుంచి కూటమి విజయం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ పడిన తపనను లోకేశ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్‌ను కేవలం ఒక రాజకీయ భాగస్వామిగా కాకుండా, కుటుంబ సభ్యునిగా, ఒక అన్నగా భావిస్తానని చెప్పడం ద్వారా కూటమి నేతల మధ్య ఉన్న బలమైన అంతర్గత బంధాన్ని ఆయన మరోసారి చాటిచెప్పారని అంటున్నారు. లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేస్తుండగా సభకు వచ్చిన కార్యకర్తల నుంచి ఈలలు, కేకలతో భారీ స్పందన లభించింది.



జగన్‌పై పొలిటికల్ పంచ్‌లు

కూటమి ప్రభుత్వం సాధించిన రెండేళ్ల విజయాలను వివరిస్తూనే, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి లోకేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను వేధించిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. "10వ తరగతి పేపర్ లీక్ చేసినప్పుడు టీచర్లు జగన్‌ను చితకబాదారు. ఆ కోపం మనసులో పెట్టుకునే ఆయనకు టీచర్స్ అంటే పడదు.. అందుకే గత వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులను మద్యం షాపుల దగ్గర కాపలాగా నుంచోబెట్టాడు" అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు పూర్తి గౌరవం కల్పిస్తున్నామని, విద్యా వ్యవస్థను సంస్కరిస్తున్నామని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ఎండగడుతూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కూటమి పాలన నిరంతరాయంగా సాగాలి:

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ఏపీ భవిష్యత్తు మారాలంటే కూటమి ప్రభుత్వం నిరంతరాయంగా కొనసాగాలని లోకేశ్ పిలుపునిచ్చారు. చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ ఆశయాలు, ప్రధాని మోదీ అండదండలతో ఆంధ్రప్రదేశ్ మళ్లీ గాడిన పడిందని, ఈ అభివృద్ధి ప్రస్థానం ఇలాగే ముందుకు సాగాలంటే కూటమికి ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. తిరుపతి వేదికగా జరిగిన 'రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి - సంక్షేమం' సభ కూటమిలో తిరుగులేని ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల మధ్య మరింత సమన్వయాన్ని, బలాన్ని పెంచేలా నేతలు ప్రసంగించారని వ్యాఖ్యానిస్తున్నారు.