వైసీపీ రాదు.. మనదే ఆ బాధ్యత: లోకేష్
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పక్షమే అన్ని బాధ్యతలు తీసుకునే దిశగా అడుగులు వేయనుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
By: Garuda Media | 6 Aug 2026 10:41 PM ISTఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పక్షమే అన్ని బాధ్యతలు తీసుకునే దిశగా అడుగులు వేయనుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. దీనికి ముందు మంత్రులతో భేటీ అయిన.. నారా లోకేష్.. పలు విషయాలను వారితో చర్చించారు. ముఖ్యంగా వైసీపీ వ్యవహరిస్తున్న తీరును ఆయన ప్రస్తావించారు.
డీఎస్సీపై యాగీ చేస్తోందని, 16 వేల మందికి ఉద్యోగాలు ఇస్తే.. కడుపుమంటతో ప్రవర్తిస్తోందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ విషయాలను ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని మంత్రులకు సూచించారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతను రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని తద్వారా వారి భవిష్యత్తును నాశనం చేసేందుకు వైసీపీ కంకణం కట్టుకుందని ఆరోపించారు. ఈ విషయాన్ని కూడా యువతకు చెప్పాలన్నారు. ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలన్న విషయంపై చర్చించారు.
ఈ సమావేశాలకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు రాబోరని లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రజల తరఫున మనమే స్పందించాల్సి ఉంటుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం ద్వారా వాటిపై చర్చిద్దామ న్నారు. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రులతో తెలిపిన మంత్రి నారా లోకేష్.. ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని సూచించారు.
గత ప్రభుత్వ విధ్వంసం, కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిన తీరు ప్రజలందరికీ తెలిసేలా చెప్పాలని మంత్రి లోకేష్ సూచించారు. అలాగే.. ఎల్నినో పరిస్థితులను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిద్దామన్న మంత్రి లోకేష్... ప్రజా సమస్యలు చర్చించే పరిష్కరించేందుకు అసెంబ్లీని వేదికగా చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రతి విషయాన్నీ.. సభలో చర్చించేలా ఎమ్మెల్యేలకు మంత్రులు గైడ్ చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ నోట్స్ తయారు చేసుకోవాలన్నారు.
