మేం 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం.. : వైసీపీకి లోకేష్ సవాల్
తాము అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే రాష్ట్రానికి సుమారు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
By: Tupaki Desk | 6 Jun 2025 8:36 PM ISTతాము అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే రాష్ట్రానికి సుమారు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. వైసీపీఐదేళ్ల కాలంలో కూడా.. దీనిలో సగం మేరకు పెట్టుబడు లు తీసుకురాలేదన్నారు. ఈ విషయంలో వైసీపీ నాయకులు తలవంచుకోవాలని వ్యాఖ్యానించారు. లేక పోతే.., తనతో చర్చకురావాలని సవాల్ రువ్వారు. రాష్ట్రంలో 11 మాసాల కాలంలో సీఎం చంద్రబాబు, తాను.. విదేశాలకు వెళ్లడంతోపాటు.. స్వదేశంలోనూ పెట్టుబడులను ఆహ్వానించినట్టు చెప్పారు.
దీనికితోడు రాష్ట్రంలో రాక్షసపాలన పోయిందన్న ధైర్యంతోనే పెట్టుబడులు వచ్చాయని.. వస్తున్నాయని తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాలు మెరుగవుతాయని చెప్పారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ అధ్యక్షతన 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల రూపాయలమేరకు పెట్టుబడులు తెచ్చామన్నారు.
వీటిలో భారీ పరిశ్రమలతోపాటు.. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా ఉన్నాయని లోకేష్ చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా యువతకు 8.5 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో భారీపెట్టుబడులు, అత్యధిక ఉద్యోగాల కల్పించేందుకు ముందుకు వచ్చిన ఎన్ టిసిపి, బిపిసిఎల్, రిలయన్స్, టాటా పవర్ వంటి సంస్థలకు పరిశ్రమలవారీగా ఈడిబిలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పిఎంయు)లను ఏర్పాటుచేసి, పరిశ్రమ స్థాపించే వరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.
