భిక్షాటన చేసే పిల్లల జీవితాలను ఒక్కరోజులో మార్చిన లోకేష్!
మంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రాథమిక విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి చేస్తున్న కృషికి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 July 2025 12:08 PM ISTమంత్రి నారా లోకేష్ రాష్ట్ర ప్రాథమిక విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి చేస్తున్న కృషికి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఏపీలోని ప్రాథమిక విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. మూతబడిన పాఠశాలను పునఃప్రారంభిస్తున్నారు. ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు పేద పిల్లల జీవితాలను ఒక్కరోజులోనే మార్చి చూపించారు.
అవును... నెల్లూరులో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన వీఆర్ (వెంకటగిరి రాజా) హైస్కూల్ ను లోకేష్ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా... పాఠశాలలో తమకు చదువు చెప్పించాలని కమిషనర్ ను అభ్యర్థించిన ఇద్దరు భిక్షాటన చేసే చిన్నారులు సీహెచ్ పెంచలయ్య, వి వెంకటేశ్వర్లకు అడ్మిషన్లు కల్పించి అండగా నిలిచారు లోకేష్.
ఈ సందర్భంగా... ఆయన చేతుల మీదుగా అడ్మిషన్ ఫాంలు ఏవో వెంకటరమణకు అందజేశారు. చిన్నారుల విద్యాభ్యాసానికి అండగా నిలుస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చిన్నారులు కష్టపడి బాగా చదువుకోవాలని, భవిష్యత్ లో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించి, వారికి ఆల్ ది బెస్ట్ చెప్పాను. దీంతో... ఒక్కరోజులో వారి జీవితంలో అద్భుతమైన మార్పు వచ్చినట్లయ్యింది. ఈ సందర్భంగా లోకేష్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో ప్రసంగించిన లోకేష్... మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరేసేందుకు 2019లో పోటీ చేసి ఓడిపోయినా కసితో పనిచేసినట్లు తెలిపారు. కష్టపడి, అక్కడి ప్రజల అండతో భారీ విజయం సాధించానని.. అదేవిధంగా విద్యాశాఖను సవాలుగా స్వీకరించి.. సమూల మార్పునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యారంగాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని నిర్ణయించామని అన్నారు.
ఇదే క్రమంలో... వన్ క్లాస్.. వన్ టీచర్ విధానంతో 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేశామని, తల్లికి వందనం పథకం కింద 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10 వేల కోట్లు జమ చేశామని వివరించారు. తరగతి గది నుంచే మహిళలను గౌరవించే పాఠ్యాంశాల బోధన దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
