ముగిసిన లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన.. చివరి రోజూ బిజీబిజీ!
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ చివరి రోజుకూడా బిజీ బిజీగా గడిపారు.
By: Garuda Media | 23 Oct 2025 9:33 PM ISTఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ చివరి రోజుకూడా బిజీ బిజీగా గడిపారు. బ్రిటీష్ మల్టీనేషనల్ హెల్త్ కేర్, ఇన్సూరెన్స్ సంస్థ బుపా ఆసియా పసిఫిక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) బిజల్ సెజ్ పాల్, దినేష్ కంతేటి(హెడ్, ఎంటర్ ప్రైజ్ ఇంటిలిజెన్స్)లతో మెల్బోర్న్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఐటీ, డేటా సెంటర్ రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్న విశాఖలో బుపా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జిసిసి) ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు.
గ్రామీణ డిజిటల్ ఆరోగ్య సేవల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సూచించారు. బుపా సీఓఓ బిజల్ సెజ్ పాల్ మాట్లాడుతూ... లండన్ కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థకు 190 దేశాల్లో 38 మిలియన్ల కస్టమర్లు ఉన్నారని తెలిపారు. ఆరోగ్య బీమా, డిజిటల్ ఆరోగ్య సేవలతో పాటు యూకే, ఆస్ట్రేలియా, స్పెయిన్ లలో వృద్ధుల సంరక్షణ కోసం కేర్ హోమ్ లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఆస్ట్రేలియా, హాంగ్ కాంగ్ తో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తాము బలమైన ఉనికి కలిగి ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా వచ్చే నెలలో విశాఖపట్నంలో జరగనున్న పారిశ్రామిక పెట్టుబడుల సదస్సుకు వస్తామని హామీ ఇచ్చారు.
కాగా.. మంత్రి నారా లోకేష్.. ఈ నెల 19న ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. మొత్తం 5 రోజుల పర్యటనలో ఆయన ఆ దేశంలోని పారిశ్రామిక వేత్తలను కలుసుకున్నారు. పెట్టుబడులు పెట్టాలని కోరారు. అదేవిధంగా ఉన్నత విద్యా సంస్థలను సందర్శించారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలకు దిశానిర్దేశం చేయడంతోపాటు.. మరిన్ని అవకాశాలు కల్పించేలా సహకరించాలని కోరారు.
