మైలవరంలో ఫిఫ్టీ-ఫిఫ్టీ.. ఎమ్మెల్యేకు సంకేతాలు!
మైలవరం నియోజకవర్గం.. తరచుగా మీడియాలోనూఎక్కువగా వినిపించే పేరు. ఇక్కడున్న సంక్లిష్ట రాజకీయాలే దీనికి కారణం.
By: Garuda Media | 22 May 2026 4:00 AM ISTమైలవరం నియోజకవర్గం.. తరచుగా మీడియాలోనూఎక్కువగా వినిపించే పేరు. ఇక్కడున్న సంక్లిష్ట రాజకీయాలే దీనికి కారణం. టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్.. విజయం దక్కించుకున్నారు. దీనికి ముందు.. కూడా ఆయనే విజయం సాధించారు. అప్పట్లో వైసీపీ తరఫున గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మళ్లీ టికెట్ ఇస్తే.. గెలిచే పరిస్థితి ఉందా? అనేది ప్రశ్న.
ప్రస్తుతం దీనిపైనే ఓ ఆన్లైన్ ప్రముఖ చానెల్ సర్వే చేపట్టింది. వసంతకు ఉన్న సానుకూలతను తెలు సుకుంది. అయితే.. ఆయనపై ఫిఫ్టీ-ఫిఫ్టీగానే ఇక్కడి ప్రజలు స్పందించారు. ఎవరూ కూడా పూర్తిస్థాయిలో మార్కులు వేయకపోవడం గమనార్హం. దీనికి కారణం.. వర్గ పోరు. కమ్మ సామాజిక వర్గంలోనే మూడు గ్రూపులు ఏర్పడ్డాయన్నది నిర్వివాదాంశం. దీనిలో ఒక వర్గం.. మాజీ మంత్రి దేవినేని ఉమాకు సపోర్టు చేస్తుండగా.. రెండో వర్గం తటస్థంగా ఉంది. మూడో వర్గం వసంతకు సానుకూలంగా ఉంది.
ప్రధానంగా ఎమ్మెల్యే పనితీరుపై స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నది సర్వేల్లో తేలిన ప్రధాన విషయం. ఇక్కడ నుంచి వాస్తవానికి వరుసగా రెండో సారి విజయం దక్కించుకున్నవారు ఎవరూ మూడో సారి గెలుపు గుర్రం ఎక్కలేదు. దీనిని పటాపంచలు చేసి.. మూడోసారి విజయం దక్కించుకోవాలని వసంత ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. ఆయనకు సానుకూలంగా పరిణామాలు లేవన్నది సర్వేలతో స్పష్టం అయింది. దీంతో తనను తాను మార్చుకోవాల్సి న అవసరం ఉంది.
ఏం చేస్తున్నారు.
1) తాను చెప్పిందే నిజమనే వాదన ఎమ్మెల్యే నుంచి వస్తోందని ఎక్కువ మంది చెబుతున్నారు.
2) నియోజకవర్గంలో జరుగుతున్న మట్టి తవ్వకాలు, అవినీతి పెరుగుతున్నాయని అంటున్నారు.
3) తమకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదని 60 శాతం మంది చెప్పారు.
4) పొగడ్తలకు పడిపోతున్నారని.. 40 శాతం మంది తెలిపారు.
5) సామాన్య పౌరులకు ఎమ్మెల్యే దర్శనం కల్పించడం లేదని.. సమస్యలు పట్టించుకోవడం లేదని ఎక్కువ మంది చెప్పారు.
