Begin typing your search above and press return to search.

‘మనీ హైస్ట్’ ప్రేరణతో ₹150 కోట్ల దోపిడీ.. చివరికి పోలీసులు చెరలో!

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మనీ హైస్ట్’ వెబ్ సిరీస్‌ చాలా మందిని ఆకట్టుకుంది.

By:  A.N.Kumar   |   6 Nov 2025 7:00 AM IST
‘మనీ హైస్ట్’ ప్రేరణతో ₹150 కోట్ల దోపిడీ.. చివరికి పోలీసులు చెరలో!
X

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మనీ హైస్ట్’ వెబ్ సిరీస్‌ చాలా మందిని ఆకట్టుకుంది. అయితే కొందరికి అది కేవలం వినోదం కాకుండా... నేరానికి ప్రేరణగా మారింది! అచ్చం ఆ సిరీస్‌ స్టైల్‌లోనే ఢిల్లీలో ఓ గ్యాంగ్‌ ₹150 కోట్ల భారీ దోపిడీకి పాల్పడింది.

వివరాల్లోకి వెళ్తే ఢిల్లీకి చెందిన ముగ్గురు యువకులు ఆర్పిత్, ప్రభాత్, అబ్బాస్ అనే వారు ఈ దొంగతనానికి మాస్టర్మైండ్స్. వీరు సిరీస్‌లోని పాత్రల మాదిరిగా తమ పేర్లను మార్చుకున్నారు. ఆర్పిత్ “ప్రొఫెసర్”, ప్రభాత్ “అమాండా”, అబ్బాస్ “ఫ్రెడ్డీ” పేర్లతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు.

వీరు మొదట సోషల్ మీడియాలో పలు ఇన్వెస్ట్మెంట్ గ్రూపులు, స్టాక్ మార్కెట్ టిప్స్ గ్రూపులు ఏర్పాటు చేశారు. మొదట చిన్న లాభాలు చూపించి నమ్మకం సంపాదించారు. తర్వాత “హై రిటర్న్స్ వస్తాయి” అంటూ వందలాది మందిని పెట్టుబడి పెట్టేలా చేశారు. ఇలా మోసగాళ్లు దేశవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్ల నుంచి దశల వారీగా ₹150 కోట్లకు పైగా వసూలు చేశారు.

బాధితులు చివరికి డబ్బులు తిరిగి ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల ఆధారంగా ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో పోలీసులు సమన్వయంగా దాడులు చేసి గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి అనేక ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, నకిలీ ఖాతా పత్రాలు, ఫేక్ పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల ప్రకారం, ఈ గ్యాంగ్‌కి మానసిక ప్రేరణ మనీ హైస్ట్ సిరీస్ నుంచే వచ్చింది. “ప్రొఫెసర్‌ మాదిరిగానే ప్లాన్‌ వేసి ఎవరూ పట్టుకోలేరని భావించారు. కానీ చివరికి రియల్‌ లైఫ్‌లో స్క్రిప్ట్‌ డిఫరెంట్‌గా వ్రాయబడింది” అని ఒక అధికారి వ్యాఖ్యానించారు.

‘మనీ హైస్ట్’లో నేరం సినిమాటిక్‌గా ఆసక్తికరంగా కనిపించినా, వాస్తవ జీవితంలో అది చట్టం ఉల్లంఘన. చట్టం చేతుల్లో పడితే తప్పించుకోవడం కష్టం.. ఢిల్లీ గ్యాంగ్ కథ అందుకు మరో ఉదాహరణగా నిలిచింది.