Begin typing your search above and press return to search.

జయలలిత గురించి మోడీ ఆసక్తికరమైన కామెంట్స్

అంతే కాదు ఆకాశవాణి దూరదర్శన్ మాధ్యమాలను కూడా ఆయన మన్ కీ బాత్ పేరుతో ప్రతీ నెలా తన భావాలను జాతితో పంచుకోవడానికి వినియోగిస్తారు.

By:  Satya P   |   25 Feb 2026 10:20 PM IST
జయలలిత గురించి మోడీ ఆసక్తికరమైన కామెంట్స్
X

ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. అంతే కాదు ఆకాశవాణి దూరదర్శన్ మాధ్యమాలను కూడా ఆయన మన్ కీ బాత్ పేరుతో ప్రతీ నెలా తన భావాలను జాతితో పంచుకోవడానికి వినియోగిస్తారు. ఇక బహిరంగ సభలలో మోడీ ప్రసంగాలు కూడా పూర్తి స్పష్టతతో ఉంటాయి.తాను ఏమి చెప్పదలచారో ఆ విషయం జనాలకు చేరేలా జనరంజకంగా చెప్పడం మోడీ ప్రసంగాలో కనిపిస్తున్నారు. ప్రతీ రాష్ట్రంలో ఉన్న ప్రముఖుల గురించి అలాగే దివంగతులైన వారి గురించి కూడా మోడీ సందర్భోచితంగా తలుస్తూ ఉంటారు. అలాగే తాజాగా నిర్వహించిన మన్ కీ బాత్ లో మోడీ తమిళనాడు ప్రజల ఆరాధ్య నాయకురాలు మాజీ సీఎం జయలలిత గురించి గొప్పగా చెప్పారు. ఆమె గురించి ఆమెతో తన స్నేహం గురించి తలచుకున్నారు.

జయలలిత గ్రేట్ :

తమిళ ప్రజలకు అమ్మగా శాశ్వతంగా ప్రేమను సంపాదించుకున్న జయలలిత ఎన్నో సార్లు సీఎం గా పనిచేశారు. ఇక 2016 డిసెంబర్ లో ఆమె ఈ లోకాన్ని వీడి పోయారు. ఆ సమయంలో కూడా మోడీ ప్రధానిగా ఉన్నారు. ఆయన స్వయంగా వచ్చి జయలలిత భౌతిక కాయం వద్ద ఘన నివాళి అర్పించారు. నాటి నుంచి అన్నాడీఎంకేతో స్నేహ బంధం బీజేపీ కలుపుతూ వచ్చింది. పళని స్వామిని సీఎం గా కుదురుకునేలా చేయడంలో కేంద్రంలో బీజేపీ పాత్ర కీలకంగా ఉంది. 2021లో కలసి బీజేపీ అన్నాడీఎంకే పోటీ చేశాయి. అయితే ఆ తరువాత విడిపోయినా 2026 అంటే ఈ ఏడాది లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం పొత్తులు పెట్టుకున్నాయి. అన్నాడీఎంకేకు గొప్ప నాయకురాలిగా ఉన్న జయలలిత గురించి మోడీ మన్ కీ బాత్ సందర్భంగా చెప్పడం విశేషం.

తమిళ ప్రజల కోసం :

జయలలిత తమిళ ప్రజల కోసం సీఎం గా ఎంతో చేశారు అని మోడీ కొనియాడారు. ఆమెకు తమిళనాడు ప్రజల సంక్షేమం వారి అభివృద్ధి ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు ఆమె తపించారని ఎంతో కష్టపడ్డారని కూడా మోడీ చెప్పారు ఇక ఫిబ్రవరి 24న జయలలిత జయంతి సందర్భంగా ఆయన ఆయన గురించి ఈ విధంగా తలచుకున్నారు అన్న మాట. జయలలిత అసాధారణ పరిపాలకురాలు అని మోడీ చెప్పుకొచ్చారు. ఆమె మహిళా సాధికారికతను ఎంతో ముఖ్యమని భావించేవారు అన్నారు. ప్రజల హృదయాలలో జయలలిత చిరస్థాయిగా నిలిచిపోయారు అని మోడీ చెప్పుకొచ్చారు.

ఆమె ఇంటికి భోజనానికి :

ఇక జయలలిత ఒకసారి పొంగల్ పండుగ సందర్భంగా తన ఇంటికి భోజనానికి తనను ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారు అని మోడీ గుర్తు చేసుకున్నారు. అంతే కాదు తాను 2002లో తొలిసారి గుజరాత్ సీఎం గా ప్రమాణం చేసినపుడు మళ్ళీ 2012లో తాను గుజరాత్ సీఎం గా ఇంకో సారి ప్రమాణం చేసినప్పుడు జయలలిత హాజరయ్యారని తనకు మంచి స్నేహితురాలిగా ఆమె అలా తమ రాష్ట్రానికి వచ్చారు అన్నారు జయలలిత స్నేహం ఆమె ఆత్మీయతను ఎన్నడూ మరచిపోలేను అని మోడీ అన్నారు.

తమిళనాడు ఎన్నికల వేళ :

ఇదిలా ఉండగా తమిళనాడు ఎన్నికల సందర్భంగా జయలలిత ఫ్యాక్టర్ చాలా ప్రాధాన్యత కాబోతోంది అని అంటున్నారు. అన్నా డీఎంకేకు ఆమె ఊపిరిగా ఉన్నారు. ఆ పార్టీ ఆమె ఫోటోతోనే జనంలోకి వెళ్తోంది. మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ సైతం జయలలిత సేవలను జనంలో ఉంచి కూటమి విజయం కోసం కృషి చేయాల్సి ఉంటుంది. మరి ఈ కేలక ఎన్నికల వేళ మోడీ జయలలితను తలచుకోవడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించారు అంటున్నారు.