జగన్తో మోడీ కటీఫ్.. తాజా డిబేట్ ఇదే!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు మధ్య ఉన్న అవినాభావ సంబంధాల గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 20 May 2025 4:40 AMప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు మధ్య ఉన్న అవినాభావ సంబంధాల గురించి తెలిసిందే. మోడీకి.. జగన్ దత్తపుత్రుడు .. అంటూ గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇలా.. గత ఐదేళ్లు కూడా.. మోడీతో ఎనలేని బంధాన్ని జగన్ పెనవేసుకున్నారు. ఆయన కోరిన రాజ్యసభ సీటును ఇచ్చారు. మోడీ కూడా.. జగన్ అడిగినన్ని అప్పులు ఇప్పించారు.
ఇదిలావుంటే.. తాజాగా జగన్తో మోడీ దాదాపు కటీఫ్ చేసుకున్నారా? అనే చర్చ సాగుతోంది. దీనికి కారణం .. తాజాగా జమ్ము కశ్మీర్లోని పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు లభించింది. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్నఆపరేషన్ సిందూర్ అద్దం పట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అఖిలపక్ష పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపించేందుకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలను ఎంపిక చేసి బృందాలను రెడీ చేశారు. ఈ బృందాల్లో బీజేపీని వ్యతిరేకించే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి, తమిళనాడు అధికార పార్టీ డీఎంకే నుంచి కూడా సభ్యులను ఎంపిక చేశారు. కానీ.. ఎటొచ్చీ.. వైసీపీ నుంచి కూడా ఒక్కరిని కూడా ఎంపిక చేయకపోవడంతో జగన్తో మోడీ ఇక, కటీఫ్ చెప్పేసినట్టేనా? అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే.. ప్రస్తుతం ఎంపిక చేసిన కమిటీల వెనుక ప్రధాని మోడీనే ఉన్నారని వార్తలు వస్తున్నాయి.
ఎందుకంటే.. పార్టీలతోనూ. ఆయా పార్టీల చీఫ్లతోనూ సంబంధం లేకుండా.. మోడీ తన కు అనుకూలంగా ఉండేవారిని ఎంపిక చేసుకుని ఈ బృందాల్లో నియమించారు. అలాంటి బృందాల్లో వైసీపీ నుంచి ఒక్కరు కూడా లేకపోవడంతో అనేక అనుమానాలకు దారి తీసింది. వైసీపీ కి ప్రస్తుతం లోక్ సభలో నలుగురు ఎంపీ లు, రాజ్యసభలో 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి వీరిలో ఒక్కరికీ ప్రధాని మోడీ ప్రాధాన్యం ఇవ్వలేదంటే.. వైసీపీ అధినేత జగన్ను దాదాపు పక్కన పెట్టేసినట్టేకదా! అంటున్నారు టీడీపీ నాయకులు కూడా. ఇక, టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయులు, అమలాపురం ఎంపీ హరీష్ గంటి ఈ బృందాల్లో చోటు దక్కించుకున్నారు.