కష్ట కాలంలో మిత్ర పక్షం: మోడీకి ఇది అవసరం.. !
అయోధ్య రామమందిర ట్రస్టును మార్చుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ.. జాతీయస్థాయిలో మోడీ సర్కారుకు తీవ్రసంకటంగా పరిణమించాయి.
By: Garuda Media | 3 Aug 2026 7:00 PM ISTప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కొన్ని రాజకీయ పరిణామాలు.. ముఖ్యంగా విద్యార్థి నిరసనలు వంటివి ప్రధాని మోడీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీక్ సహా.. అయోధ్య రామయ్య మం దిర విరాళాల చోరీ ఘటన వంటివి రాజకీయాలకు అతీతంగా ప్రజల్లో నిరసనలకు దారి తీశాయి. ఇవి ఒక్క వర్గానికి.. లేదా ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు. అన్ని సామాజిక వర్గాల విద్యార్థులు పరీక్షలు రాశారు. అన్ని వర్గాల వారూ.. రాముడికి విరాళాలు ఇచ్చారు.
దీంతో ఈ రెండు విషయాలలో జరిగిన తప్పులు.. సహజంగానే కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. ఎన్నడూలేని విధంగా ఒక నిరసన కారణంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించాల్సి వచ్చింది. అయోధ్య రామమందిర ట్రస్టును మార్చుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ.. జాతీయస్థాయిలో మోడీ సర్కారుకు తీవ్రసంకటంగా పరిణమించాయి. మరోవైపు ప్రధాని, హోం శాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి.
ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో మోడీని సమర్థించే వారు అవసరం. మోడీని మెచ్చుకునేవారు.. ఆయనకు అండగా ఉండే వారు.. అత్యంత అవసరం. ఖచ్చితంగా ఇదేసమయంలో ఏపీ నుంచి మోడీకి బలమైన మద్దతు లభించింది. భోగాపురం వేదికగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు.. ఆయనకు అండగా నిలిచారు. ప్రధానికి మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ దేశానికి అందివచ్చిన వరమని ప్రశంసలు గుప్పించారు.
పైకి చూస్తే.. ఇవి పొగడ్తలుగా అనిపించినా.. కేంద్రం దృష్టిలోను, ముఖ్యంగా ప్రధాని దృష్టిలోను.. ఈ కీలక క్లిష్ట సమయంలో ఆయనకు చంద్రబాబు, పవన్ అందించిన బూస్ట్ అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్నట్టు అంచనా వేసుకుంటున్న సమయంలో అనూహ్యంగా వీరిద్దరూ మద్దతు ప్రకటించడం.. కేంద్ర ప్రభుత్వానికి దన్నుగా మారింది. పైగా.. దక్షిణాదిలో బలమైన రెండు ప్రాంతీయ పార్టీల నుంచి మద్దతు కూడగట్టడం ద్వారా.. ఈ సమయంలో ప్రధానికి బిగ్ రిలీఫ్ వచ్చినట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు.
