70 ఏళ్ల కేసీఆర్పై 27 ఏళ్ల ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..సోషల్ మీడియాలో ఆగ్రహం!
ప్రస్తుతం రాజకీయాల్లో భాషా సంస్కారం మంటగలిసిపోతుందా ? ఎవరూ ఊహించని విధంగా 27 ఏళ్ల ఎమ్మెల్యే నోట బూతు పురాణం విని అందరూ షాక్ తిన్నారు.
By: Tupaki Desk | 18 April 2025 7:49 AMప్రస్తుతం రాజకీయాల్లో భాషా సంస్కారం మంటగలిసిపోతుందా ? ఎవరూ ఊహించని విధంగా 27 ఏళ్ల ఎమ్మెల్యే నోట బూతు పురాణం విని అందరూ షాక్ తిన్నారు. 70 ఏళ్ల వయసు, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద ఆ దారుణ వ్యాఖ్యలు చేసిన ఏ ఎమ్మెల్యే ఎవరూ ? రాజకీయ దుమారం రేపుతున్న ఆ వీడియోలో ఏముంది? ఈ కథనంలో తెలుసుకుందాం.
రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న సీనియర్ నేతలు కొన్నిసార్లు వివాదాస్పద, కఠినమైన పదాలు వాడడం సాధారణమే. కానీ కొత్త తరం రాజకీయ నాయకులు మాత్రం సంస్కారవంతమైన భాషను ఉపయోగించాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే, తెలంగాణలోని 27 ఏళ్ల ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాత్రం ఈ విషయంలో ఆ హద్దులు దాటి అందరికీ షాక్ ఇచ్చాడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో రోహిత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై అత్యంత అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించాడు.
"నేను ఎవ్వడికీ భయపడను. కేసీఆర్ గాడు సీఎం గా ఉన్నప్పుడే ఉచ్చ పోయించినా" అంటూ రోహిత్ వ్యాఖ్యానించాడు. తన ఉద్దేశంలో అతను ఎవరికీ భయపడనని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకే భయం తెప్పించానని చెప్పాడు. అయితే, యువ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోహిత్ రాజకీయాల్లోనే లేడు. అంతే కాకుండా 70ఏళ్లకు పైబడిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన, పదేళ్లు కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అసామాన్య వ్యక్తి మీద 27 ఏళ్ల యువ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎవరికీ నచ్చడం లేదు. సోషల్ మీడియాలో నెటిజన్లు రోహిత్ తన ప్రవర్తనను మార్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారు. ఇలాంటి అసభ్యకరమైన భాష వల్ల రాజకీయాల్లో ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం కష్టమని హెచ్చరిస్తున్నారు.
మరో ముఖ్య విషయం ఏంటంటే.. రోహిత్ తండ్రి హనుమంతరావు 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కాబట్టి, కేసీఆర్పై ఇలాంటి భాషను ఉపయోగించే నైతిక హక్కు రోహిత్కు లేదని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.