పాకిస్తాన్ కి మైక్రోసాఫ్ట్ గుడ్ బై.. రోడ్డు మీదకు వచ్చిన పాకిస్తాన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్
ప్రపంచంలోని అతిపెద్ద సాంకేతిక సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో తన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికింది.
By: Tupaki Desk | 5 July 2025 3:13 PM ISTప్రపంచంలోని అతిపెద్ద సాంకేతిక సంస్థలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో తన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికింది. అధికారికంగా ప్రకటన రానప్పటికీ పాకిస్తాన్లోని మైక్రోసాఫ్ట్ సీఈవో జవాద్ రెహ్మాన్ "ఇది ఒక శకానికి ముగింపు" అని వ్యాఖ్యానించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నిర్ణయంతో అక్కడ పనిచేస్తున్న అనేక మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతూ రోడ్డెక్కారు. వారి నిరాశ, అనిశ్చితి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. పాకిస్తాన్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మైక్రోసాఫ్ట్ తమ కార్యకలాపాలను నిలిపివేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. తమ దేశ పరిస్థితులు సరిగా లేనందుకు తాము బాధ్యులమా అని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
- 25 ఏళ్ల సేవలకు ముగింపు
మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్లో 2000, మార్చి 7న తన కార్యకలాపాలను ప్రారంభించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా అనేక రంగాలలో కీలక సేవలందిస్తూ 'డిజిటల్ పాకిస్తాన్' కలను సాకారం చేయడానికి కృషి చేసింది. గ్రామీణ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటు, విద్యాసంస్థలతో భాగస్వామ్యం, యువతకు సాంకేతిక శిక్షణ, చిన్న వ్యాపారాలకు సాంకేతిక మద్దతు వంటి అనేక మైలురాళ్లను అధిగమించింది.
-ఎందుకు నిష్క్రమణ?
మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయానికి రావడానికి గల కారణాలపై స్పష్టమైన ప్రకటన వెలువడనప్పటికీ నిపుణుల అంచనాల ప్రకారం పాకిస్తాన్లోని రాజకీయ, ఆర్థిక అస్థిరతలే ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. తరచుగా మారుతున్న ప్రభుత్వాలతో స్థిరత్వం లేని రాజకీయ వాతావరణం నెలకొంది. భారీ పన్నుల భారంతో వ్యాపార కార్యకలాపాలపై అధిక పన్నులు గుదిబండగా మారాయి. కరెన్సీ విలువ క్షీణతతో దేశ కరెన్సీ విలువ నిరంతరం పడిపోవడం మైక్రోసాఫ్ట్ కు భారంగా మారింది. టెక్నాలజీ దిగుమతుల్లో ఆంక్షలు.. సాంకేతిక దిగుమతులపై పరిమితులు... పెట్టుబడులపై భద్రతా సందేహాలు.. విదేశీ పెట్టుబడులకు భద్రత లేదనే అంచనాలు... మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలకు పెద్ద దెబ్బగా మారాయి.
- ఆర్థిక సంక్షోభం తీవ్రత
పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. 2024 ఆర్థిక సంవత్సరానికి పాకిస్తాన్ వాణిజ్య లోటు $24.4 బిలియన్లకు పెరిగింది. జూన్ 2025 నాటికి విదేశీ మారక నిల్వలు $11.5 బిలియన్లకు పడిపోయాయి. ఈ పరిస్థితి విదేశీ సంస్థల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతూ దేశానికి వచ్చే అవకాశాలను తగ్గించింది.
- పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడి ఆవేదన
ఈ సందర్భంగా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ స్పందిస్తూ "మైక్రోసాఫ్ట్ నిష్క్రమణ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితికి పెద్ద దెబ్బ. రాజకీయ అస్థిరత వల్ల అవకాశాలు చేజారిపోతున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు. 2022లో బిల్ గేట్స్తో తాను మాట్లాడినప్పుడు, పాకిస్తాన్లో పెట్టుబడులపై ఆసక్తి చూపారని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్య నాదెళ్ల, అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో చర్చలు కూడా జరిగాయని, అయితే ఆ తర్వాత ప్రభుత్వ మార్పులు, అనిశ్చిత పరిస్థితులు మైక్రోసాఫ్ట్ను వియత్నాం వంటి ప్రత్యామ్నాయ దేశాల వైపు మళ్లించాయని వివరించారు.
- రోడ్డునపడ్డ ఇంజనీర్లు.. భవిష్యత్తు ప్రశ్నార్థకం
మైక్రోసాఫ్ట్ నిష్క్రమణతో పాటు, పాకిస్తాన్లోని అనేక మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ కంపెనీలో పనిచేసిన ఇంజనీర్లు ఇప్పుడు తమ భవిష్యత్తు ఏమిటని ఆందోళనలో ఉన్నారు. రోడ్డున పడి ఆందోళనలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దేశంలోని ఇతర టెక్ కంపెనీలు కూడా తమ వ్యాపార వ్యూహాలను పునరాలోచిస్తున్నాయని సమాచారం.
ఒక ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఒక దేశాన్ని విడిచి వెళితే, అది కేవలం వ్యాపారపరంగా మాత్రమే కాకుండా ఆ దేశ స్థిరత్వంపై, ప్రపంచ పెట్టుబడిదారుల నమ్మకంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మైక్రోసాఫ్ట్ నిష్క్రమణ పాకిస్తాన్కు ఒక గుణపాఠం. అయితే దీన్ని ఒక సవాలుగా స్వీకరించి, వ్యవస్థల పునర్నిర్మాణం వైపు అడుగులు వేయడం ఆ దేశానికి తక్షణ అవసరం.