వచ్చే ఎన్నికల్లో మా ఆవిడ పోటీ: మంచు మనోజ్
కలెక్షన్ కింగ్ మోహన్బాబు చిన్నకుమారుడు మంచు మనోజ్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Garuda Media | 19 May 2026 4:28 PM ISTకలెక్షన్ కింగ్ మోహన్బాబు చిన్నకుమారుడు మంచు మనోజ్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2029 ఎన్నికల్లో తన సతీమణి మంచు మౌనిక ఎన్నికల రంగంలోకి దిగుతున్నట్టు వెల్లడించారు. రాజకీయం తమకు కొత్తకాదని పేర్కొన్న మంచు.. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించు కున్నట్టు వెల్లడించారు. రాజకీయాల్లో ఇప్పటికే తాము భాగస్వామ్య మయ్యామని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఐక్య(AIKYA ) పేరుతో స్వతంత్ర సంస్థను స్థాపించిన మనోజ్ దంపతులు.. సమాజంలోని పేదల పక్షాన నిలబడుతామని ప్రకటించారు. వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువస్తామ న్నారు. ఈ క్రమంలో తమకుఎవరి సహాయం అవసరం లేదని.. తమ సొంత సొమ్మునే ఖర్చు పెడుతున్నామన్నారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద సంస్థ అని వివరించారు. దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావొచ్చన్నారు.
తన భార్య మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని మనోజ్ వెల్లడించారు. అయితే.. రాజకీయాలకు.. తాము స్థాపించిన ఐక్య సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రాజకీయాలు చేయడం.. రాజకీయాల్లో కొనసాగడం తమ రెండుకుటుంబాలకు కొత్తకాదన్నారు. మౌనిక తండ్రి, సోదరి కూడా రాజకీయాల్లోనేఉన్న విషయాన్నిఆయన గుర్తు చేశారు. తన తండ్రి కూడా రాజకీయాలు చేశారని .. ప్రస్తుతం కొంత గ్యాప్ వచ్చిందని చెప్పారు. తిరిగి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నామన్నారు.
ఏ పార్టీ.. ?
అయితే.. తన సతీమణి మౌనిక ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయంపై మనోజ్ స్పష్టత ఇవ్వలేదు. కానీ.. ఇటీవల కాలంలో ఈ కుటుంబం టీడీపీకి చేరువగా ఉంటోంది. తరచుగా మంత్రి నారా లోకేష్ తో నూ మనోజ్ భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ తోనే వీరి రాజకీయాలు కొనసాగుతాయా? లేక.. వైసీపీ వైపు చూస్తారా? అనేది స్పష్టత రావాల్సి ఉంటుంది. మౌనిక సోదరి.. అఖిల ప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ(కర్నూలు జిల్లా) నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. మౌనిక తండ్రి నాగిరెడ్డి, తల్లి శోభ లుకూడా రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారే కావడం గమనార్హం.
