Begin typing your search above and press return to search.

మ‌హానాడు- ఎన్టీఆర్‌కు చంద్ర‌బాబుకు తేడా ఇదే..!

టీడీపీ నిర్వ‌హించే మ‌హానాడుకు ప్ర‌తి సంవ‌త్స‌రం మే 27, 28, 29 తేదీలు ఖ‌రారు. ఈ విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే.. ఇలా తీర్చిదిద్ద‌డం వెనుక చంద్ర‌బాబు కృషి ఉంది.

By:  Tupaki Desk   |   27 May 2025 8:07 AM
మ‌హానాడు- ఎన్టీఆర్‌కు చంద్ర‌బాబుకు తేడా ఇదే..!
X

టీడీపీ నిర్వ‌హించే మ‌హానాడుకు ప్ర‌తి సంవ‌త్స‌రం మే 27, 28, 29 తేదీలు ఖ‌రారు. ఈ విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే.. ఇలా తీర్చిదిద్ద‌డం వెనుక చంద్ర‌బాబు కృషి ఉంది. అంతేకాదు.. మూడు రోజుల ప్రతిపాద‌న కూడా ఆయ‌న‌దే. వాస్త‌వానికి అన్న‌గారి పుట్టిన రోజున నిర్వ‌హించే మ‌హానాడు.. తొలి నాళ్ల‌లో రెండు రోజులు మాత్రమే చేసేవారు. అది కూడా త‌క్కువ మంది నాయ‌కులతోనే పూర్తి చేసేవారు.

ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల‌తో కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యేవి. దీనికి అన్న‌గారు చెప్పిన మాట‌.. ''మీడియాకు కూడా స‌మ‌యం ఇవ్వాలి క‌దా. మన గురించి వారు రాయాలంటే.. స‌మ‌యం పడుతుంది. ఇంత పెద్ద మ‌హా క్ర‌తువు'' అని వ్యాఖ్యానించేవారు. దీంతో సాయంత్రం 4-5 త‌ర్వాత ముగించేవా రు. ఫ‌లితంగా ఎక్కువ స‌మ‌యం మీడియాకు స‌మ‌యం ఉండేది. ఇప్ప‌టి మాదిరిగా.. ప్రింటింగ్ సౌల‌భ్యం మ‌న‌కు 1990ల‌కు ముందు ఉండేది కాదు.

దీంతో సాధ్య‌మైనంత వేగంగా ముగించేవారు. అంతేకాదు.. మ‌హానాడు గురించి వార్త‌లు వ‌చ్చిన ప‌త్రిక‌ల ను ప్ర‌ధానంగా మ‌హానాడు వేదిక‌గా ప్ర‌ద‌ర్శించేవారు. ఏ ప‌త్రిక ఎలా రాసిందో కూడా చ‌ద‌వి వినిపించేం దుకు `మీడియా సెల్`ను అప్ప‌ట్లోనే తొలిసారి ప్రారంభించారు. ఇక‌, చంద్ర‌బాబు ప‌గ్గాలు చేప‌ట్టాక కూడా.. దాదాపు అదేస‌మ‌యం కేటాయిస్తున్నా.. సాయంత్రం 7 గంట‌ల వ‌ర‌కు పొడిగించారు. ఇక‌, అన్న‌గారి స‌మ‌యంలో అంద‌రూ నేల‌పై కూర్చునే చ‌ర్చించేవారు.(గ‌త మ‌హానాడులు చూస్తే తెలుస్తుంది)

నేల‌పై ప‌రుపులు ప‌రిచి.. 'అంద‌రూ స‌మానం' అనే స్ఫూర్తిని చెప్ప‌క‌నే చెప్పేవారు. ప్ర‌త్యేకంగా వేదిక‌లు ఉండేవి కాదు. అన్న‌గారు ఎదురుగా కూర్చుని ఉంటే.. ఆయ‌న చుట్టూ నాయ‌కులు కూర్చుని ఉండేవారు. త‌ర్వాత త‌ర్వాత‌.. చంద్ర‌బాబు మార్పులు చేశారు. ప్ర‌ధాన వేదిక‌.. దానికి ముందు కుర్చీలు అంగ‌రంగ వైభ‌వంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హ‌ణతో కొత్త హంగులు జ‌త‌చేశారు. అంతేకాదు.. అన్న‌గారి హ‌యాంలో మ‌హానాడు అంటే.. కేవ‌లం తీర్మానాల వ‌ర‌కే ప‌రిమితం చేసేవారు. భోజ‌నాల‌కు ప్ర‌త్యేక‌త ఉండేది కాదు. కానీ.. చంద్ర‌బాబు హ‌యాంలో వీటికి కూడా ప్రాధాన్యం పెంచారు.