Begin typing your search above and press return to search.

పీఓకే విషయంలో భారత్ కు బ్రిటీష్ ఎంపీ ఆసక్తికర సూచన!

పహల్గాం ఉగ్రదాడి భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే దేశాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 April 2025 3:11 PM IST
British MP Lord Meghnad Desai Urges India to Reclaim PoK
X

పహల్గాం ఉగ్రదాడి భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే దేశాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూఎస్, యూకే, ఇజ్రాయెల్, రష్యా, ఫ్రాన్స్ మొదలైన దేశాల నుంచి భారత్ కు మద్దతు లభించిన పరిస్థితి. ఈ సమయంలో భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీ ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... తాజాగా పహాల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ వ్యవహారంపై భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ దేశాయ్ స్పందించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి సూచించారు. ఇందులో భాగంగా... కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించారు.

ఇదే సమయంలో.. ఉగ్రవాదులను శిక్షించడానికి, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండటానికి.. ఈ సారి భారత్ ఇచ్చే జవాబు కఠినంగా ఉండాలని మేఘనాథ్ కోరారు! ఈ నేపథ్యంలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికీ భారత్ లో భాగమే అని మేఘనాథ్ నొక్కి చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి చాలా క్రూరమైనదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో... భారత్ – పాక్ మధ్య నెలకొన్న కశ్మీర్ వివాదంలో పహల్గాం ఘటనే చివరిది కావాలని ఆశాభావం వ్యక్తం చేసిన మేఘనాథ్... ఈ విషయంలో మోడీ నేతృత్వంలోని భారత సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.