లోక్ సభ డిప్యూటీ స్పీకర్ కోసం కాంగ్రెస్ డిమాండ్
చట్ట సభలలో స్పీకర్ ఉంటారు. అలాగే డిప్యూటీ స్పీకర్ ఉంటారు. గ్రామాలోని పంచాయతీల నుంచి చూసుకున్నా సర్పంచ్ తరువాత ఉప సర్పంచ్ ఉంటారు.
By: Tupaki Desk | 11 Jun 2025 5:00 AM ISTచట్ట సభలలో స్పీకర్ ఉంటారు. అలాగే డిప్యూటీ స్పీకర్ ఉంటారు. గ్రామాలోని పంచాయతీల నుంచి చూసుకున్నా సర్పంచ్ తరువాత ఉప సర్పంచ్ ఉంటారు. ఈ విధంగా అసెంబ్లీ పార్లమెంట్ లలో కూడా డిప్యూటీ స్పీకర్ పాత్ర కీలకమైనది. రాజ్యాంగంలో ఎంతో గౌరవనీయమైనదిగా తీర్చిదిద్దారు.
అయితే లోక్ సభలో చూస్తే గత ఆరేళ్ళుగా డిప్యూటీ స్పీకర్ లేరు అన్నది తెలిసిందే. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ అయిదేళ్ళలో లోక్ సభలో స్పీకర్ గా సుమిత్రా మహాజన్ ఉంటే డిప్యూటీ స్పీకర్ గా అన్నా డీఎంకేకు ఎందిన ఎం తంబి దురైకి ఎన్డీయే ప్రభుత్వంలో ఎన్నుకున్నారు.
ఎండీయే మిత్రపక్షంగా అన్నా డీఎంకే ఉండడంతో ఆ పదవిని వారిని ఇచ్చారు. పార్లమెంటరీ విధానం ప్రకారం అధికార పక్షానికి స్పీకర్ పదవి ఇస్తే విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారు. అయితే దానికి మిత్రపక్షాలకు ఇస్తూ అధికార పక్షం తనదైన రాజకీయ పద్ధతులలో సాగడం వర్తమాన కాలంలో కనిపిస్తోంది.
ఇక చాలా అసెంబ్లీలలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పదవులు రెండూ అధికార పక్షమే తీసుకుంటోంది. విపక్షాలకు నో చాన్స్ అంటోంది. ఇక ఎన్డీయే ప్రభుత్వం 2019లో వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చినపుడు స్పీకర్ గా ఓం బిర్లాను ఎన్నుకున్నారు. ఆయన బీజేపీకి చెందిన వారు. అయితే ఆ అయిదేళ్ళ కాలంలో లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే గడచిపోయింది.
ఒక సమయంలో వైసీపీకి ఈ పదవి ఇస్తారు అన్న ప్రచారం సాగింది. కానీ అది జరగలేదు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి మొదటి రెండు టెర్ములలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ పదవిని అయితే ఇవ్వలేదు. ఇక 2024 ఎన్నికల్లో మూడవసారి వరసగా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ఏడాది పాలన కూడా జూన్ 9తో పూర్తి చేసుకుంది. అయితే ఈ ఏడాది కాలంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే లోక్ సభ కార్యకలాపాలు నడచాయి. ఈ నేపధ్యంలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను వెంటనే చేపట్టాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తాజాగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆ పదవిని ఖాళీగా ఉంచడం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని ప్రజాస్వామ్య దేశమైన భారత్లో సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజ్యాంగం ప్రకారం స్పీకర్ తర్వాత డిప్యూటీ స్పీకర్ లోక్సభకు రెండవ అత్యున్నత ప్రిసైడింగ్ అధికారిగా ఆయన చెప్పారు. అందువల్ల భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 93 ప్రకారం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరినీ ఎన్నుకోవడం తప్పనిసరి విధానం అని గుర్తు చేశారు. ఇక చూస్తే కనుక మొదటి లోక్సభ నుండి 16వ లోక్సభ వరకు ప్రతి సభలో డిప్యూటీ స్పీకర్ ఉన్నారని లేఖలో పెర్కొన్నారు.
అయితే అయితే స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఈ కీలకమైన రాజ్యాంగబద్ధమైన స్థానం వరుసగా రెండు లోక్సభ పర్యాయాలుగా ఖాళీగా ఉందఅని ఖర్గె అసంతృప్తిని వ్యక్తం చేశారు. పదిహేడవ లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికల కాలేదని అన్నారు అలాగే 18వ లోక్సభలో కూడా ఇది కొనసాగుతోందని చెప్పుకొచ్చారు ఇలా చేయడం, పూర్తిగా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని ఖర్గె అన్నారు.
ఇక జూలై 21నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు తన డిమాండ్ను పరిగణనలోకి తీసుకోవాలని, లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నికను పూర్తి చేయాలని ఖర్గె ప్రధానికి రాసిన లేఖలో కోరారు. ఇదిలా ఉంటే బీజేపీ నాయకత్వం ఖర్గె డిమాండ్ ని పరిగణనలోకి తీసుకుంటుందా అన్న చర్చ సాగుతోంది.
ఒక వేళ తీసుకోవాలని అనుకున్నా మిత్ర పక్షం అయిన తెలుగుదేశం పార్టీకో లేదా మరో మిత్రపక్షం జేడీయూ కో ఈ పదవి ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా డిప్యూటీ స్పీకర్ పదవి ఉండాలని ప్రజాస్వామ్య ప్రియులు కూడా కోరుతున్నారు.