ఏపీ పారిశ్రామిక ప్రగతిలో భారీ ముందడుగు!
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తన నూతన తయారీ యూనిట్కు బుధవారం భూమి పూజ నిర్వహించింది.
By: Tupaki Desk | 8 May 2025 4:57 PMతిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తన నూతన తయారీ యూనిట్కు బుధవారం భూమి పూజ నిర్వహించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. రూ. 5వేల కోట్లకు పైగా భారీ పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ యూనిట్తో రాష్ట్రంలో వేలాది ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ యూనిట్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.
ఆవిష్కరణ, పెట్టుబడి కలిసేచోట భవిష్యత్తు : మంత్రి లోకేశ్
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఆవిష్కరణ, పెట్టుబడి కలిసేచోట భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అన్నారు. శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్కు శంకుస్థాపన చేయడం కేవలం ఒక యూనిట్కు మాత్రమే కాదని, ఏపీ భవిష్యత్తు కోసం కొత్త పునాదులు వేస్తున్నామన్నారు. ఇది రాష్ట్రంతో పాటు దేశ పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక ప్రగతిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. రూ.5వేల కోట్లకు పైగా పెట్టుబడితో ఎల్జీ ప్రపంచ స్థాయి తయారీ యూనిట్ను రాష్ట్రానికి తీసుకొచ్చిందన్నారు. 'మేడ్ ఇన్ ఆంధ్రా నుంచి మేడ్ ఫర్ ది వరల్డ్’ వరకు తమ జైత్రయాత్ర కొనసాగుతుందని లోకేశ్ స్పష్టం చేశారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ప్రధాన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఒకటిగా ఎల్జీ శ్రీసిటీ యూనిట్ ఆవిష్కృతమైందని తెలిపారు. పారిశ్రామిక రంగంలో వేగం, బలమైన మౌలిక సదుపాయాలు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై సీఎం చంద్రబాబు నాయుడు నిబద్ధతకు ఇది అద్దం పడుతోందన్నారు. ప్రభుత్వం సులభతర వ్యాపారానికి హామీ ఇవ్వడంతో పాటు, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాలను అనుసరిస్తోందని వివరించారు. ఈ యూనిట్లో రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు వంటి అధునాతన, స్మార్ట్, ఇంధన-సమర్థవంతమైన గృహోపకరణాలను తయారు చేస్తారని తెలిపారు.
ఇది ఒక స్మార్ట్ ఫ్యాక్టరీ, ఒక స్మార్ట్ రాష్ట్రం, ఒక స్మార్ట్ దేశం యొక్క సరికొత్త ప్రయాణానికి నాంది అని లోకేశ్ పేర్కొన్నారు. కేవలం తయారీ మాత్రమే కాకుండా, జీవన భవిష్యత్తును రూపొందించడం, ఉద్యోగాలను సృష్టించడం, యువతకు సాధికారత కల్పించడం, జీవితాలను మార్చడం కూడా దీని లక్ష్యమని అన్నారు. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 1,500 మొత్తం 2,000 నుండి 2,500కు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు. దేశానికి అవసరమైన ఎయిర్ కండీషనర్లలో 70 శాతం ప్రస్తుతం ఏపీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ అనుబంధ యూనిట్లతో పాటు ఎల్జీ సిటీ కూడా నిర్మించాలని కోరారు. రాబోయే నాలుగేళ్లలో శ్రీసిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వాణిజ్యానికి ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటుందని, సరికొత్త ఆవిష్కరణలు, మార్పు కోసం ఆతృతగా ఎదురుచూస్తోందని మంత్రి లోకేశ్ అన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన యూనిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ను ఎంచుకున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీని ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం: సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శ్రీసిటీలో రూ.5,800 కోట్లకు పైగా పెట్టుబడులతో, ప్రత్యక్షంగా పరోక్షంగా 2,500కు పైగా ఉద్యోగాలతో ఈ సంస్థ ఏపీని ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఒప్పందం చేసుకుందని తెలిపారు. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ కింద ఈ సంస్థ 100శాతం ప్రోత్సాహకాలు పొందిందని పేర్కొన్నారు. ఇది ఏపీలో పారిశ్రామిక వృద్ధికి ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయానికి నాంది పలికిందని పేర్కొంటూ, శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్కు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేసిన అనంతరం దిగిన ఫొటోను ముఖ్యమంత్రి షేర్ చేశారు.
- కియా తర్వాత ఇప్పుడు ఎల్జీ వస్తోంది: కొరియా రాయబారి
భారత్లో కొరియా రాయబారి లీ సియాంగ్ హూ మాట్లాడుతూ.. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో తమ దేశానికి చెందిన కియా కంపెనీ ఏర్పాటైందని గుర్తుచేశారు. ఇప్పుడు ఎల్జీ వస్తోందని, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాల సహాయ, సహకారాలు అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ హాంగ్ జు జియోన్, భారత్లో కొరియన్ రిపబ్లిక్ రాయబారి లీ సియాంగ్ హో, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ హోం సొల్యూషన్స్ సీఈఓ జేచియోల్ లియు తదితరులు పాల్గొన్నారు.