Begin typing your search above and press return to search.

దటీజ్ లోకేశ్.. విదేశీయులకూ ఆ సంస్కృతి నేర్పారు.

తెలుగుదేశం యువనేత, ఏపీ ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో తనదైన ముద్ర వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 May 2025 3:14 PM IST
Korean Team Joins Lokesh in Temple-Style Groundbreaking
X

తెలుగుదేశం యువనేత, ఏపీ ఐటీ, హెచ్ఆర్డీ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో తనదైన ముద్ర వేస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి 11 నెలల్లోనే ప్రజల్లో దూసుకుపోతున్న లోకేశ్.. తనకున్న అవగాహనతో రాష్ట్రానికి పెద్ద పరిశ్రమలు రావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. విశాఖపట్నంలో టీసీఎస్ సర్వీస్ సెంటర్ ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం.. తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి కర్మాగారానికి తాజాగా శంకుస్థాపన చేసింది. మే 8న జరిగిన ఈ శంకుస్థాపనలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ సంఘటన నెట్టింట వైరల్ అవుతోంది.

మే 8న శ్రీసిటీలో రూ.5,860 కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఉప్పత్తి యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దేశంలో ఎల్జీ సంస్థకు ఇది మూడో యూనిట్ కాగా, దక్షిణ భారత్ లో మొదటి యూనిట్. మరోవైపు కొరియన్ కంపెనీ అయిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన రెండో సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో కొరియాకే చెందిన కియా కార్ల పరిశ్రమ అనంతపురం జిల్లాలో ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ విధంగా ఏపీలో పెట్టుబడులకు కొరియన్ పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు.

అయితే గురువారం ఎంతో అట్టాహాసంగా హిందూ సంప్రదాయబద్ధంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో విశేషం లేకపోయినా, ఓ విదేశీ సంస్థ స్థానిక ఆచారాలను గౌరవిస్తూ పూజాధికాలు చేయడమే వైరల్ అవుతోంది. ప్రధానంగా శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి నారా లోకేశ్ సంప్రదాయాలు, ఆచారాలకు పెద్దపీట వేస్తూ కాళ్లకు చెప్పులు తీసివేసి పూజలు చేశారు. అదేవిధంగా కింద కూర్చొని కొబ్బరి కాయ కొట్టారు. తనలాగే కొరియన్ పారిశ్రామికవేత్తలు సైతం కాళ్లకు చెప్పులు లేకుండా కొబ్బరి కాయ కొట్టాలని, అది మన సంప్రదాయమని ఎల్జీ ప్రతినిధులకు మంత్రి లోకేశ్ చెప్పారు. దీంతో మంత్రి లోకేశ్ మాదిరిగానే కొరియన్ ప్రతినిధులు సైతం సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి అధికార ప్రతినిధిగా మంత్రి నారా లోకేశ్ ఒక్కరే హాజరుకాగా, ఎల్జీ పరిశ్రమ నుంచి దాదాపు అరడజను మంది వచ్చారు. వారంతా మంత్రి లోకేశ్ సూచనల మేరకు మన సంప్రదాయాన్ని గౌరవిస్తూ పూజా కార్యక్రమం చేయడం వైరల్ అవుతోంది. ఈ వీడియోను చాలా మంది టీడీపీ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇంటర్ నెట్లో వైరల్ చేస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత సైతం ఈ వీడియోను షేర్ చేస్తూ మంత్రి లోకేశ్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘మన సంప్రదాయాలు తెలిసి కూడా గత ప్రభుత్వంలో యజ్ఞ, యాగాలకు చెప్పులు వేసుకుని వెళ్లిన మనషులును చూశాం.. ఒంగి కొబ్బరికాయ కొట్టలేక మీడియాలో వార్తలకెక్కిన వారూ ఉన్నారు’’ అంటూ సెటైర్లు వేశారు. తనతోపాటుగా విదేశీయులను మన సంప్రదాయాల్లో భాగస్వాములు చేశారంటూ మంత్రి లోకేశ్ ను అనిత అభినందించారు.