బాబు నియోజకవర్గానికి మరో మహర్దశ!
సీఎం చంద్రబాబు 40 ఏళ్లుగా విజయం సాధిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని హైగ్రేడ్ మునిసిపాలిటీగా ఇటీవల ప్రకటించారు.
By: Garuda Media | 1 May 2026 10:17 AM ISTఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి మరో కీలకప్రాజెక్టు రానుంది. దీనిపై ఏర్పడిన న్యాయ వివాదాలను.. సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ``అభివృద్ధి చేసేప్పుడు.. కొన్నిసమస్య లు వస్తాయి. వాటిని కూర్చుని పరిష్కరించుకోవాలి. ప్రతి విషయాన్నీ కోర్టులు పరిష్కరించలేవు. భూము లు ఇవ్వకపోతే.. ప్రాజెక్టులు ఎలా వస్తాయి. దీనికి సంబంధించిన పరిహారం తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది .`` అని వ్యాఖ్యానిస్తూ.. సదరు ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.
ఏం జరిగింది?
సీఎం చంద్రబాబు 40 ఏళ్లుగా విజయం సాధిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని హైగ్రేడ్ మునిసిపాలిటీగా ఇటీవల ప్రకటించారు. ఇక్కడకు పెట్టుబడులు కూడా వస్తున్నాయి. దేశ విదేశీ సంస్థలు కూడా క్యూ కడుతున్నాయి. పైగా కుప్పంలోని శాంతిపురం సహా.. రెండు మండలాలు.. సౌర విద్యుత్ సంపూర్ణ వినియోగ మండలాలుగా రికార్డు సృష్టించాయి. మరోవైపు.. ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారు చేసే కార్యక్రమం కూడా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖుల రాకపోకలు పెరిగాయి.
కానీ, కుప్పానికి రావాలంటే.. బెంగళూరు విమాశ్రాయానికి వచ్చి.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రావాల్సి వస్తోంది. దీంతో వ్యయ ప్రయాసలతోపాటు.. కీలకమైన సమయం వృథా అవుతోంది. దీనిని గమనించిన చంద్రబాబు.. ఈ ఏడాది ప్రారంభంలోనే కుప్పంలో విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. దీనిని 150 ఎకరాల్లో నిర్మించేలా ప్లాన్ చేశారు. భూ సేకరణకు కూడా ప్రకటన ఇచ్చారు. అయితే.. కొందరు ఈ ప్రకటనను వ్యతిరేకిస్తూ. రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. విమానాశ్రయ నిర్మాణాన్ని తాము అడ్డుకోలేమని.. భూసేకరణ అవసర మైనప్పుడు.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇచ్చే పరిహారాన్ని తీసుకోవాలని పేర్కొంటూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే..ఈ తీర్పును సవాల్ చేస్తూ.. పిటిషనర్లు.. సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాజాగా గురువారం దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. దేశవ్యాప్తంగా అభివృద్ధి జరుగుతోందని.. భూములు తీసుకోకుండా అభివృద్ధి సాధ్యం కాదని వ్యాఖ్యానించింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది. దీంతో కుప్పంలో విమానాశ్రయ నిర్మాణానికి మార్గం సుగమం అయింది. దీనిని వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. టీడీపీకే చెందిన విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఈ నిర్మాణ పనులపై ఇప్పటికే రెండు సార్లు సమీక్షించారని కేసులు తొలగి పోతే.. పనులు చేపట్టేందుకు టెండర్లు పిలవనున్నారని తెలిసింది. ఇప్పుడు కేసులు తొలగిపోయాయి.
