మీ రక్త దాహం తీరలేదా: కాంగ్రెస్ పై కేటీఆర్ ఆగ్రహం
మీరక్త దాహం ఇంకా తీరలేదా? అంటూ.. కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణలో 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల రక్తం తాగిందని.. ఆయన విమర్శించారు.
By: Garuda Media | 13 July 2026 9:58 AM ISTతెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్కు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు మధ్య రైతుల సమస్యలు, ప్రాజెక్టుల వ్యవహారంపై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. గత నాలుగు రోజులుగా ఈ విషయంపైనే ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాళేశ్వరం సహా.. మేడిగడ్డ ప్రాజెక్టుల వ్యవహారంపై ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
మీరక్త దాహం ఇంకా తీరలేదా? అంటూ.. కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణలో 60 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల రక్తం తాగిందని.. ఆయన విమర్శించారు. ఉద్యమ సమయంలో వేలాది మంది కార్యకర్తలు, ఉద్యమ కారుల రక్తం చవిచూస్తే తప్ప.. రాష్ట్రం ఇవ్వలేదని ఆరోపించారు. ఇంకా ఆయా కుటుంబాలు కోలుకోలేదని చెప్పారు. ఇప్పుడు రైతులకు నీళ్లు ఇవ్వకుండా.. వారి బలిదానాలు కోరుకుంటున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ రక్కసి కోరలకు.. తెలంగాణ బిడ్డల రక్తపు మరకలు అంటాయని పేర్కొన్న కేటీఆర్.. రాష్ట్ర సాధన కోసం.. పేగులు తెగేలా ఇక్కడి బిడ్డలు కొట్లాడితే తప్ప.. కనికరించలేదన్నారు. ఇప్పుడు ప్రాజెక్టులలో నీరు ఉన్నా.. రైతులకు చుక్క కూడా ఇవ్వకుండా వారి రక్తాన్ని చవి చూడాలని చూస్తోందని పేర్కొన్నారు. ``రైతుల కోసం ఎంత రక్తమైనా ధారపోసేందుకు మేం సిద్ధం. మా రక్తం ఎంత కావాలంటే అంత పంపిస్తాం.. మీ రక్తదాహం తీర్చుకోండి.`` అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులకు మాత్రం నీళ్లివ్వండి అని కోరారు.
