టికెట్ ప్లీజ్: తమ్ముడి కోసం.. టీడీపీ ఎమ్మెల్యే ప్రయత్నం!
గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. టీడీపీ తరఫున అదేస్థానం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.
By: Garuda Media | 27 May 2026 7:00 AM ISTవచ్చే 2029 ఎన్నికల్లో తమ తమ వారసులను రంగంలోకి దింపే ప్రయత్నంలో కొందరు నాయకులు ఉ న్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది తమ వారసులను బరిలో నిలిపారు. అయి తే.. ఇప్పుడు వారసుల మాట ఎలా ఉన్నా.. తమ్ముడిని ఎమ్మెల్యేగా చూడాలని తనకుటుంబం కోరుకుం టోందంటూ.. టీడీపీ ఎమ్మెల్యే ఒకరు కీలక ప్రతిపాదనను తెరమీదికి తెచ్చారు. అంతేకాదు.. తాను కూడా బరిలోనే ఉంటానన్న సంకేతాలు కూడా ఇచ్చారు.
ఎవరా తమ్ముడు?
గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. టీడీపీ తరఫున అదేస్థానం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. వైసీపీలోను గతంలో కాంగ్రెస్లోనూ.. ఉన్నప్పుడు కూడా ఇదే స్థానం నుంచి పలుమార్లు ఆయన విజయం దక్కించుకున్నారు. అయితే.. తాజాగా తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి కూడా టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇదేమీ నాలుగు గోడల మధ్య చేసిన ప్రతిపాదన కాదు.
నేరుగా మీడియా ముందే కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. తన కుటుంబంలోని సభ్యులు.. గిరిధర్ రెడ్డిని ఎమ్మె ల్యేగా చూడాలని అనుకుంటున్నారని చెప్పారు. అది కూడా రూరల్ నియోజకవర్గం నుంచేనని తెలిపా రు. పోనీ.. ఈ నియోజకవర్గం నుంచి ఆయనేమైనా తప్పుకుంటున్నారా? అంటే.. లేదట. వచ్చే ఎన్నికల్లో తనకు ఎక్కడ టికెట్ ఇచ్చినా.. గెలిచి తీరుతానని.. కానీ, తన సోదరుడికి మాత్రం నెల్లూరు రూరల్ టికెట్ కావాలని ఆయన కోరుతుండడంగమనార్హం.
ముందే.. కర్చీఫ్?
వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉందని ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే.. పలువురు నాయకులు ముందస్తుగా తమ తమ వాదనలను వినిపిస్తున్నారు. దీనిలో భాగంగానే కోటంరెడ్డి కూడా ముందే కర్చీఫ్ వేసేసినట్టు స్థానిక నాయకులు భావిస్తున్నారు. కేంద్రం చేపట్టిన నియోజకవర్గాల పెంపుతో నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాలను కొంత మేరకు విడదీసి.. `నెల్లూరు నియోజకవర్గం`గా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. దీనిని ముందుగానే పసిగట్టిన ఎమ్మెల్యే.. తన సోదరుడి కోసం.. కర్చీఫ్ వేస్తున్నారన్న చర్చ సాగుతోంది. మరి దీనిపై టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.
