కోనసీమలో కలకలం.. జనసేనకు ఎఫెక్టేనా ..!
అయితే.. దీనిని తొలుత పోలీసులు.. తర్వాత దళితులు కూడా అడ్డుకున్నారు. ఈ వ్యవహారమే రచ్చగా మారింది.
By: Tupaki Desk | 31 May 2025 12:30 AMఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో రాజకీయ కలకలం రేగింది. ఇక్కడి కాపులకు.. దళితులకు మధ్య తీవ్ర పొలిటికల్ ఫైట్ తెరమీదికి వచ్చింది. అయితే.. ఇది ఎటు మలుపు తీసుకుంటుందన్నది పక్కన పెడితే.. జనసేన చుట్టూ ఈ రాజకీయం కొత్త మలుపు తిరగడం మరింత ఆసక్తిగా మారింది. సఖినేటి పల్లిలో కాపు ఉద్యమ నాయకుడు రంగా విగ్రహం పెట్టేందుకు కొందరు కాపులు ప్రయత్నించారు.
అయితే.. దీనిని తొలుత పోలీసులు.. తర్వాత దళితులు కూడా అడ్డుకున్నారు. ఈ వ్యవహారమే రచ్చగా మారింది. కాపు నాయకుడిగా ప్రజలకు పెన్నిధిగా ఉన్న రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో జనసేన నాయకులు తమకు సహకరించలేదని.. కాపు నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఇది వారి వ్యక్తిగత వ్యవహారమని.. తమకు పార్టీ నుంచి ఎలాంటి సమాచారం లేదని జనసేన నేతలు చెబుతున్నారు.
కానీ, తాము విగ్రహం పెట్టాలంటే.. అనుమతి ఉందని.. అయినప్పటికీ.. పోలీసులు అడ్డుకుంటున్నారని.. ఈ విషయంలో జనసేన జోక్యం చేసుకోవాలన్నది కాపు నాయకుల మాట. ఈ విషయమే ఇప్పుడు రాజకీ యంగా ఇరుకున పెడుతోంది. జనసేన వాస్తవానికి ఏ కులాన్నీ భుజాన మోయలేదు. వేసుకోలేదు. అయినా.. రాజకీయాల్లోకి వచ్చాక.. ఔనన్నా.. కాదన్నా.. కూడా కులం ముద్ర పడిపోతుంది. దీంతో కాపులు గత ఎన్నికల్లో జనసేనను ఓన్ చేసుకున్నారు.
వైసీపీ ని కాదని జనసేనకు పట్టం కట్టారు. ఇప్పుడు వారు కోరుతున్నట్టుగా.. రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు జనసేన సహకరించాలన్నది కాపుల డిమాండ్. కానీ.. దీనికి అనుమతి ఇస్తే.. ఇది రాజకీయ వివాదంగా మారుతుందని జనసేన నాయకులు ఆలోచనలో పడ్డారు. రెండు రోజుల కిందట మొదలైన ఈ కోనసీమ విగ్రహం ఏర్పాటు వివాదం ఇప్పటికీ కొనసాగుతుండడం గమనార్హం. మున్ముందు.. ఏం జరుగుతుందో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.