Begin typing your search above and press return to search.

మంత్రి పదవి కోసం మళ్లీ రెచ్చిపోయిన కోమటిరెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  A.N.Kumar   |   5 Aug 2025 10:51 PM IST
మంత్రి పదవి కోసం మళ్లీ రెచ్చిపోయిన కోమటిరెడ్డి
X

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం దిగజారి బతకలేనని, ప్రజల కోసం అవసరమైతే మరోసారి త్యాగానికైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.

పదవిని త్యాగం చేశా.. కానీ మాట నిలబెట్టుకోలేదు

మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో తనకు వచ్చిన మంత్రి పదవిని త్యాగం చేసి కాంగ్రెస్‌లో చేరానని గుర్తు చేశారు. మునుగోడు ప్రజల కోసం తాను ఈ బలమైన నిర్ణయం తీసుకున్నానని, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామన్న హామీపై నమ్మకం ఉంచానని తెలిపారు. అయితే ఇప్పుడు జూనియర్లకు పదవులు ఇచ్చి తనను పక్కన పెట్టారని, నాయకత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం విజ్ఞత అని పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రజల ప్రేమ ముఖ్యం.. పదవి కోసం దిగజారను

రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఉంటే మంత్రి పదవి ఖచ్చితంగా దక్కేదని వెల్లడించారు. కానీ, మునుగోడు ప్రజల కోసం తాను అక్కడి నుంచే పోటీ చేశానని, పదవి కంటే ప్రజల ప్రేమే తనకు గొప్పదని అన్నారు. పదవుల కోసం ఎవరి కాళ్లకూ మొక్కే రకం కాదని, దిగజారి బతకడం తనకి తెలియదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకోసం అవసరమైతే మళ్లీ త్యాగం చేయడానికి తాను సిద్ధమని తేల్చి చెప్పారు.

మునుగోడు ప్రజలే నా శ్వాస

"నన్ను గెలిపించిన మునుగోడు ప్రజల అభిమానమే నాకు పెద్ద పదవి. వారి నమ్మకాన్ని నేను ఎప్పటికీ నిరాశపరచను. నా ప్రజలు తలదించుకునే పని జీవితంలో ఎప్పటికీ చేయను" అని రాజగోపాల్ రెడ్డి భావోద్వేగంతో అన్నారు. తనకు పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందని, తన స్వప్రయోజనాల కోసం పార్టీపై ఒత్తిడి చేయడం ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిర్గతం చేశాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, కోమటిరెడ్డి మాత్రం పదవి కన్నా ప్రజలకు ఇచ్చిన మాటకే ఎక్కువ విలువ ఇస్తున్నారని స్పష్టమవుతోంది.