'పల్నాటి పులి'.. ప్రజల హృదయాల్లో పదిలం.. !
అయితే.. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల బాట పట్టారు. అప్పటి వరకు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పల్నాడ ప్రాంతానికి అభివృద్ధిని పరిచయం చేశారు.
By: Tupaki Desk | 2 May 2025 3:19 PMపల్నాడు ప్రాంతంలో సమస్యలు పరిష్కరించేందుకు అహరహం శ్రమించిన నాయకుడిగా పేరొందిన దివంగత ఏపీ అసెంబ్లీ స్పీకర్.. కోడెల శివప్రసాదరావు. నేడు(మే 2) ఆయన జయంతి. దీనిని పురస్కరిం చుకుని భారీ ఎత్తున సంబరాలు చేసేందుకు స్వచ్ఛందంగా ప్రజలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దరిమిలా.. ఈ ఉత్సాహం మరింత రెట్టింపైంది. నరసరావుపేటకు చెందిన కోడెల శివప్రసాదరావు .. వృత్తిరీత్యా వైద్యుడు.
అయితే.. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల బాట పట్టారు. అప్పటి వరకు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పల్నాడ ప్రాంతానికి అభివృద్ధిని పరిచయం చేశారు. వాస్త వానికి కాసు బ్రహ్మానందరెడ్డి వంటి అగ్రనేతలు.. కాంగ్రెస్ నాయకులు ఈ జిల్లాకు చెందిన వారే అయినా.. వారు పెద్దగా స్థానిక సమస్యలను పరిష్కరించలేక పోయారు. రాష్ట్ర స్థాయి నాయకులుగా నే వారు చలా మణి అయ్యారు. ఈ గ్యాప్.. కోడెలకు కలిసి వచ్చింది.
దీంతో పల్నాడు ప్రాంతాన్ని అబివృద్ది చేసేందుకు నడుం బిగించారు. పాఠశాలల నిర్మాణం, రహదారుల అభివృద్ది, గ్రామీణ స్థాయిలో వైద్యాన్ని ఆయన పరిచయం చేశారు. దీంతో ఆయన ప్రజలకు దేవుడు మాదిరిగా మారారు. ఇప్పటికి కొన్ని పల్లెల్లో కోడెల విగ్రహాలు ఉన్నాయంటే.. ఆయన పేరు ఎంత మేరకు ప్రజల హృదయాల్లో నాటుకుపోయిందో అర్ధం అవుతుంది. ఇక, రాజకీయంగా కూడా.. కోడెల దూకుడుగానే ఉండేవారని అంటారు ఇక్కడి ప్రజలు.
అభివృద్ధి, సంక్షేమం విషయంలో తనతో కలిసి వచ్చే నాయకులు ఎవరైనా కోడెల కలుపుకొని పోయేవారు. కానీ.. తనను ఎదిరించేవారితో తాను కూడా అలానే వ్యవహరించేవారని ఇక్కడి వారు చెబుతారు. రాజకీయ ప్రత్యర్థులకు సింహ స్వప్నంగా ఆయన వ్యవహరించి.. ప్రజల పట్ల నిబద్ధతను చాటుకున్నారని అంటారు . అందుకే పల్నాడు పులిగా ఇక్కడి ప్రజలు కోడెలను గెండెల్లో దాచుకుంటారు. ఇదిలావుంటే.. కోడెల జయంతిని పురస్కరించుకుని.. ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం.