కొడుకు పొలిటికల్ ఎంట్రీ కోసం నల్లారి వారి స్కెచ్ !
ఈ క్రమంలో సమైక్యాంధ్రా పేరుతో పార్టీని స్థాపించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కొన్నాళ్ళకు తిరిగి ఆ పార్టీలో చేరారు.
By: Tupaki Desk | 16 April 2025 7:30 PMనల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ పేరు రాజకీయాల మీద అవగాహన ఉన్న వారి అందరికీ తెలిసిన సంగతే. ఆయన ఉమ్మడి ఏపీకి మూడేళ్ళ పాటు సీఎం గా పనిచేశారు. ఆయన అలా చిట్ట చివరి సీఎం గా పేరు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సమైక్య ఆంధ్ర కోసం ఆయన తనదైన శైలిలో కృషి చేశారు.
ఈ క్రమంలో సమైక్యాంధ్రా పేరుతో పార్టీని స్థాపించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కొన్నాళ్ళకు తిరిగి ఆ పార్టీలో చేరారు. ఆ తర్వాత అందులో నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. 2024 ఎన్నికల్లో రాజంపేట ఎంపీ సీటు నుంచి పోటీ చేశారు కానీ ఓటమి పాలు అయ్యారు.
నిజంగా ఆయనకు అది బ్యాడ్ లక్ అని అంటున్నారు. ఆయన కనుక గెలిచి ఉంటే కచ్చితంగా కేంద్ర మంత్రి అయి ఉండేవారు అని అంటారు. ఇక ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటు కోసం ఆయన తన వంతుగా ప్రయత్నం చేస్తున్నారు అని వార్తలు ఉన్నాయి.
ఇవన్నీ ఇలా ఉంటే ఆయన తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకుని వస్తున్నారు అని అంటున్నారు. ఆయన కుమారుడి పేరు నిఖిలేష్ రెడ్డి. ఆయన తండ్రి మాదిరిగానే రాజకీయాల పట్ల పూర్తి ఆసక్తితో ఉన్నారని అంటున్నారు. 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసినపుడు అన్ని వ్యవహరాలను దగ్గరుండి నిఖిలేష్ రెడ్డి చూసుకున్నారు అని అంతా చెబుతారు.
ఆయన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని పట్టుదలగా ఉన్నారని చెబుతున్నారు. దాంతో ఆయన ఆసక్తిని చూసిన కిరణ్ కుమార్ రెడ్డి కుమారుడిని ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా తన తండ్రి నుంచి రాజకీయ వారసత్వం తీసుకునే వచ్చారు. నల్లారి వారి కుటుంబానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపుగా అర్ధ శతాబ్దం రాజకీయ చరిత్ర ఉంది. ఆయన తండ్రి అమర్నాథ్ రెడ్డి ఆ రోజులలోనే మంత్రిగా ఉంటూ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు.
ఇక కిరణ్ తమ్ముడు కిశోర్ కుమార్ రెడ్డి కూడా రాజకీయంగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం పీలేరు నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఇపుడు నల్లారి వారి కుమారుడు నిఖిలేష్ రాజకీయంగా ఎలా ముందుకు సాగుతారు అన్న చర్చ సాగుతోంది. ఆయన ఎంబీయే చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నారు. ఆయనను వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే జనాలలో ఉంచడం ద్వారా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించేలా చూడాలని కిరణ్ కుమార్ రెడ్డి చూస్తున్నారు అని అంటున్నారు.
ఇక ఆయన రాజకీయ కార్యక్షేత్రంగా రాజం పేటను ఎంచుకుంటారని అంటున్నారు. అంటే 2024లో తండ్రి పోటీ చేసి ఓడిన ఎంపీ సీటు నుంచే తనయుడు పోటీ చేసి విక్టరీ కొట్టాలని చూస్తున్నారుట. తండ్రితో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మొత్తం నియోజకవర్గం రాజకీయాల మీద అవగాహన పెంచుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇపుడు అక్కడ నుంచే విజయపతాక ఎగరేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. మరి నల్లారి వారి రాజకీయ వారసత్వం మూడవ తరంలో నిఖిలేష్ రెడ్డి ఎలా నిలబెడతారో చూడాల్సిందే అని అంటున్నారు. ఇక ఆయనకు బీజేపీ పెద్దల ఆశీస్సులే తరువాయి అని కూడా అంటున్నారు.