ఎన్నికల వేళ.. కాంగ్రెస్ను ఇరికించేసిన ఖర్గే!
కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇరకాటంలో పడింది. కాంగ్రెస్పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన `ఉగ్రవాది` వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.
By: Garuda Media | 22 April 2026 8:34 AM ISTకీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇరకాటంలో పడింది. కాంగ్రెస్పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన `ఉగ్రవాది` వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అయితే.. తను అన్నది ఒకటి.. ప్రచారంలోకి వచ్చింది మరొకటని ఖర్గే చెబుతున్నారు. కానీ, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చివరి రోజు మంగళవారం.. ఖర్గే.. మాట్లాడుతూ.. ప్రధానిని ఉగ్రవాదితో పోల్చారు.
''ఒకప్పుడు మోడీని వ్యతిరేకించిన అన్నడీఎంకే(జయలలిత పార్టీ) ఇప్పుడు అదే ఉగ్రవాదితో ఎలా చేతులు కలిపింది? ''అని ఎన్నికల ప్రచారంలో ఖర్గేనిలదీశారు. ఈ వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం రేపాయి. అసలే అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ..ఈ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకుంది. పార్టీ తరఫున అనేక మంది నాయకులు కాంగ్రెస్ నైజం ఇదీ అంటూ.. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా స్పందించారు. ఉగ్రవాదులను హతమారిస్తే.. కన్నీరు పెట్టిన పార్టీ.. అంటూ కాంగ్రెస్పై కేంద్ర మంత్రి, తెలంగాణకు చెందిన బండి సంజయ్ దుయ్యబట్టారు.
కాంగ్రెస్కు ఓటమి భయం..
కాంగ్రెస్కు తమిళనాడులో ఓటమి భయం పట్టుకుందని.. పలువురు బీజేపీ నాయకులు దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే మోడీని టెర్రరిస్టు అంటూ.. వ్యాఖ్యానించారని.. ఖర్గే అంతటి నాయకుడే ఇలా అంటే ఇక, కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్ధమైందని అన్నారు. పార్టీ ఓటమిని జీర్ణించుకునే స్థాయిలో లేని నాయకులు.. మోడీని లక్ష్యంగా చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇది తగదని.. ఖర్గే తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నేనలా అనలేదు..
కాగా.. తన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న నేపథ్యంలో ఖర్గే స్పందించారు. తాను ప్రధానిని ఎప్పుడూ అలా అనలేదని అన్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో సీబీఐ,ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయని.. అధికారులను కూడా అరెస్టు చేస్తున్నారని.. ఈ నేపథ్యాన్నే తాను ఉదహరించానని చెప్పారు. ప్రజలను, రాజకీయ పార్టీలను భయ భ్రాంతులకు గురి చేస్తున్న మోడీ .. అనే ఉద్దేశంలోనే తాను ఇలా వ్యాఖ్యలు చేశానని.. ఆయన పట్ల తనకు ఎప్పుడూ గౌరవం ఉందని అన్నారు.
