Begin typing your search above and press return to search.

బాబు కూడా లోకేష్ మాటే వినాలి... కేశినేని సంచలన కామెంట్స్...!

తెలుగుదేశం పార్టీలో అసలైన పెత్తనం నారా లోకేష్ దే అని ఆ పార్టీని విడిచి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 March 2024 9:18 AM GMT
బాబు కూడా లోకేష్ మాటే వినాలి... కేశినేని సంచలన కామెంట్స్...!
X

తెలుగుదేశం పార్టీలో అసలైన పెత్తనం నారా లోకేష్ దే అని ఆ పార్టీని విడిచి వైసీపీలో చేరిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అంటున్నారు. ఆయన ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీలోని అసలైన సీక్రెట్స్ చాలా చెప్పాలి. తెలుగుదేశం పార్టీలో బయటకు కనిపించేది చంద్రబాబు ఆయన అధికారం ఆయన నిర్ణయాలు అని. కానీ తెర వెనక ఉండేది అంతా లోకేష్ బాబే అని కేశినేని అంటున్నారు.

ఇది ఇవాళ్టితో కాదని 2014 నుంచి లోకేష్ హవా టీడీపీలో మొదలైందని, అది కాస్తా 2024 నాటికి పీక్స్ కి చేరిందని నాని అంటున్నారు. లోకేష్ కి ఇష్టం లేకపోతే ఎవరూ పార్టీలో ఉండలేరని అన్నారు. ఆయన పార్టీలో ప్రతీ విషయాన్ని శాసిస్తున్నారని ఆరోపించారు. తనకు నచ్చని వారికి పొగపెట్టి పంపించేయడం కూడా లోకేష్ కి తెలుసు అన్నారు.

లోకేష్ ఆరు వందల మందితో ఒక సోషల్ మీడియా టీం ని నడుపుతున్నారని కేశినేని నాని చెప్పుకొచ్చారు. ఆ టీం లో ఉన్న వారు అంతా సొంత పార్టీ బయట పార్టీలలో ఉన్న ప్రత్యర్ధుల మీద ఎంతకైనా తెగించి పోస్టింగులు పెడతారు అని కేశినేని నాని అంటున్నారు ఇంట్లో ఆడవారిని సైతం చూడకుండా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడతారు అని ఆయన విమర్శించారు.

తన విషయంలో కూడా లేని పోని ఆరోపణలు చేయించి బయటకు పంపించారు అని కేశినేని నాని మండిపడ్డారు. తాను టీడీపీని వీడిపోవాలని ఏనాడూ అనుకోలేదని అన్నారు. అలాంటి పరిస్థితి కల్పించారు అన్నారు. దీనివల్ల టీడీపీకి విజయవాడలో నష్టం జరిగిందని ఆయన అంటున్నారు.

తాను సొంత వ్యక్తిత్వంతో ఉంటానని ఒకరికి బానిసత్వం చేయడం తమకు కుదరని పని అని ఆయన అన్నారు. భజన చేసే వారికే లోకేష్ పెద్ద పీట వేసి వారిని తమ మీదకు ఉసి గొలిపి తిట్టిస్తున్నారు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన మీద చేసిన ఆర్ధిక అవినీతి ఆరోపణలు నిరూపించాలని ఆయన సవాల్ చేశారు తెలుగుదేశం పార్టీకి విజయవాడలో తాను అన్ని రకాలుగా అండగా ఉన్నాను అని ఆయన అన్నారు. పార్టీ కోసం పన్నెండేళ్ల పాటు పనిచేశానని ఈ విషయంలో ఆర్ధికంగా కూడా తాను దెబ్బ తిన్నాను అని అన్నారు.

తనకు టీడీపీ పెద్దలకు మధ్య గ్యాప్ రావడానికి కారణం వారి పాలసీలను తాను వ్యతిరేకించడమే అని కేశినేని అంటున్నారు. అమరావతి రాజధాని కోసం వేల ఎకరాల భూములు ఎందుకు అని తాను అడిగాను అని అన్నారు. బాబు కలలు కంటున్న అమరావతి పూర్తి కావాలంతే మరో యాభై ఏళ్ళు పడుతుందని అన్నారు. ఇదే విషయం తాను గతంలోనే చెప్పాను అని అన్నారు. విజయవాడ గుంటూరులను ట్విన్ సిటీలుగా అభివృద్ధి చేసుకుంటే ఈ రోజుకు బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడేదని ఆయన అన్నారు.

కానీ తన సలహాలు పట్టించుకోకపోగా తనను పార్టీలో శతృవుగా చూశారు అని అన్నారు. చంద్రబాబుకు లోకేష్ మనస్తత్వాల గురించి కూడా కేశినేని సంచలన కామెంట్స్ చేశారు. తండ్రీ కొడుకులు ఇద్దరిలోనూ అణువణువునా అభద్రతాభావం ఉందని ఆయన విమర్శించారు. తమ కంటే అవతల వారు ఎదగకూడదు అన్న మనస్తత్వం వారిది అని కేశినేని నాని ఆరోపించారు. ముఖ్యంగా కమ్మ వారిలో వేరే ఎవరూ ఎదగరాదని తామే ఉండాలన్నది వారి భావన అని అన్నారు.

మనసు చంపుకునే చాలా మంది టీడీపీలో ఉంటున్నారని కేశినేని నాని అన్నారు. తాను మాత్రం అలా కాకుండా తన సొంత వ్యక్తిత్వంతోనే ఉంటున్నా అని చెప్పారు. తాను వైసీపీలో గత డెబ్బై రోజులుగా జగన్ ని చూస్తున్నాను అని టీడీపీని తిట్టమని ఏ రోజూ ఆయన చెప్పలేదని అన్నారు. తాను కూడా టీడీపీని వ్యక్తిగత విమర్శలు చేయనని అనని వారి విధానాల మీదనే విమర్శలు చేస్తాను అని అన్నారు.

ఇక విజయవాడ నుంచి ఈసారి పోటీ చేయను అని గతంలో పది మంది ముందే బాబుకు చెప్పానని అయితే ఆయన ఆనాడు అందరి ముందూ మీరే ఉండాలి మీరే పోటీ చేయాలని చెప్పి మరీ ఆ తరువాత పొగ పెట్టించారని ఆ పంతంతోనే తాను పోటీలో ఉంటున్నాను అని చెప్పారు. తనకు ప్రజలకు మధ్య ఉన్న కనెకషన్ తో మూడవసారి గెలిచి తీరుతాను అని కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు.