Begin typing your search above and press return to search.

కేరళ ప్రభుత్వ సంచలన నిర్ణయాలు.. విద్యార్థినులకు పీరియడ్స్ లీవ్స్, ఆఫీసుల్లో డేకేర్ సెంటర్లు!

రాష్ట్రంలోని మహిళా శ్రమశక్తిని పెంచడానికి, విద్యార్థినుల ఆరోగ్యాన్ని రక్షించడానికి వీడీ సతీషన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు తీవ్ర చర్చకు తెరలేపాయని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   30 May 2026 1:22 PM IST
కేరళ ప్రభుత్వ సంచలన నిర్ణయాలు.. విద్యార్థినులకు పీరియడ్స్ లీవ్స్, ఆఫీసుల్లో డేకేర్ సెంటర్లు!
X

మహిళా సాధికారతపై కేరళం రాష్ట్రం మరోసారి వార్తల్లో నిలిచింది. కేరళంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రభుత్వం మహిళలు, విద్యార్థినుల కోసం విప్లవాత్మక నిర్ణయాలను ప్రకటించింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ రాజేంద్ర చేసిన తొలి ప్రసంగంలో రాష్ట్ర భవిష్యత్తును మార్చేసే పలు కీలక సంక్షేమ పథకాలను వెల్లడించారు. రాష్ట్రంలోని మహిళా శ్రమశక్తిని పెంచడానికి, విద్యార్థినుల ఆరోగ్యాన్ని రక్షించడానికి వీడీ సతీషన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు తీవ్ర చర్చకు తెరలేపాయని అంటున్నారు.

నెలకు 3 రోజులు రుతుక్రమ సెలవులు

యూడీఎఫ్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలో విద్యార్థినులకు రుతుక్రమ సెలవులు ప్రకటించడాన్ని అత్యంత అద్భుతమైన నిర్ణయంగా కొనియాడుతున్నారు. రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థినులకు ప్రతి నెలా 3 రోజుల పాటు పెయిడ్ సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుతుక్రమ సమయంలో అమ్మాయిలు ఎదుర్కొనే శారీరక, మానసిక ఇబ్బందులను గుర్తించి, వారికి ఉపశమనం కలిగించడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలకే పరిమితమైన ఈ విధానాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విప్లవాత్మకంగా అమలు చేయబోతున్నారు.

ఆఫీసుల్లో క్వాలిటీ డేకేర్ సెంటర్లు

ఉద్యోగం చేసే తల్లులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 50 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయంలో విధిగా క్వాలిటీ డేకేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీనివల్ల చిన్న పిల్లలున్న తల్లులు ఎలాంటి ఆందోళన లేకుండా ఆఫీసుల్లో పని చేసుకోవచ్చు. ఇది మహిళలు తమ కెరీర్‌ను మధ్యలోనే వదిలేయకుండా అడ్డుకుంటుందని చెబుతున్నారు.

6 నెలల ప్రసూతి సెలవులు

మహిళా ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ.. ప్రసవ సమయంలో ఇచ్చే మెటర్నిటీ లీవ్స్‌ను జీతంతో కూడిన 6 నెలల సెలవులుగా కచ్చితంగా అమలు చేయనున్నట్లు గవర్నర్ స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగంలోనూ ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రంలో నిరుపేదలు, అనాథలు లేని సమాజాన్ని సృష్టించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని గవర్నర్ రాజేంద్ర వెల్లడించారు. అనాథ శరణాలయాల్లో ఉన్న పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తును అందించేందుకు లీగల్ దత్తత ప్రక్రియలను సరళీకృతం చేయనున్నారు.

కేరళ నూతన యూడీఎఫ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా, మహిళల నిజ జీవిత సమస్యలైన పీరియడ్స్, చైల్డ్ కేర్, ప్రసూతి సెలవులపై చట్టసభల్లో నిర్ణయాలు తీసుకోవడం కేరళ ప్రగతిశీల ఆలోచనకు నిదర్శనమని అభినందిస్తున్నారు. ఈ పథకాలు విజయవంతంగా అమలైతే, మిగిలిన రాష్ట్రాలకు కూడా కేరళ ఒక రోల్ మోడల్‌గా నిలవడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు.