బిడ్డను బాపూ ఏమంటున్నారు? ఫాంహౌస్ లో ఏం జరుగుతోంది?
కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కం ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అంశాలు పతాక శీర్షికల్లో వస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 May 2025 4:52 AMకొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కం ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అంశాలు పతాక శీర్షికల్లో వస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఏర్పాటు చేసిన మీడియా చిట్ చాట్ అనంతరం టీవీ చానళ్లలోనూ బ్రేకింగ్ న్యూస్ గా కవిత వ్యాఖ్యలు కనిపించాయి. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఒక్క విషయాన్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. అదేమంటే.. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. గులాబీ పార్టీలో పెను కలకలాన్ని రేపుతున్న బిడ్డ కవితపై ఫామ్ హౌస్ లో ఉన్న బాపూ రియాక్షన్ ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఎందుకుంటే.. తనకు కానీ తన పార్టీకి కానీ కించిత్ నష్టం వాటిల్లేలా వ్యవహరించే వారి విషయంలో కేసీఆర్ ఎంత కఠినంగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తనకు ఎంతో సన్నిహితులైన వారిని సైతం ఆయన విడిచిపెట్టింది లేదు. ఆయనకు కోపం వస్తే పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్ లాంటి వారికి సైతం కఠిన శిక్షలు (తమ సొంత మీడియా సంస్థలో ఫోటో దగ్గర నుంచి ఎలాంటి వార్త పబ్లిష్ కాకుండా చూడటం) వేయటం తెలిసిందే. అలాంటప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన కవిత అంశంపై బాపూ రియాక్షన్ ఏమిటి? అన్నది ప్రశ్న.
కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కవిత చేస్తున్న వ్యాఖ్యలపై కేసీఆర్ గుంభనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతో సన్నిహితుల వద్ద తప్పించి..ఆయన ఈ విషయం మీద మాట్లాడలేదంటున్నారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఆయన గుర్రుగా ఉన్నప్పటికి.. ఇప్పటికిప్పుడు స్పందించాలన్న ఆలోచనలో లేదన్నట్లుగా చెబుతున్నారు. సంక్షోభాలు.. సవాళ్లు బీఆర్ఎస్ కు.. కేసీఆర్ కు కొత్తేం కాదు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు.. ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.
అయితే.. అవన్నీ ఒక ఎత్తు తాజాగా జరుగుతున్నది మరో ఎత్తు. ఏ రాజకీయ అధినేత అయినా వారి గురించి..వారి కుటుంబంలోని అంశాల మీద విరుచుకుపడే కేసీఆర్ కు తొలిసారి తన సొంత కుటుంబంలో చోటు చేసుకున్న పంచాయితీని సరిచేసే అంశంపై కాస్తంత కన్ఫ్యూజన్ తో ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అదే పనిగా స్పందించే కన్నా.. వేచి చూసే ధోరణి మంచిదన్న ఆలోచనతో ఆయన వ్యవహరిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇందుకు తగ్గట్లే.. కవిత ఎపిసోడ్ కు సంబంధించిన పరిణామాలపై అతిగా స్పందించకుండా.. ఆచితూచి అన్నట్లుగా రియాక్టు కావాలన్న సంకేతాలు తమ సొంత మీడియా సంస్థలకు అందినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికైతే వేచి చూసే ధోరణి తప్పించి.. విరుచుకుపడకుండా ఉండాలన్న నిర్ణయానని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు భిన్నంగా కవితకు నోటీసులు అన్న ప్రచారం జోరుగా సాగినా.. గురువారం రాత్రి వరకు అలాంటిదేమీ లేకపోవటం గమనార్హం. కవిత విషయంలో తొందరపాటు వద్దొన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.