కేసీఆర్ సెంటర్ గా.. భారీ సభలో ఒకే ఒక్కడి స్పీచ్
ఇదిలా ఉంటే.. ఈ భారీ బహిరంగ సభలో గులాబీ బాస్ ఎంతసేపు మాట్లాడతారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 27 April 2025 4:45 AMమిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. భారీగా కార్యక్రమాల్ని చేపట్టే విషయంలో గులాబీ బాస్ కేసీఆర్ తర్వాతే ఎవరైనా. మిగిలిన రాజకీయ అధినేతల మాదిరి నిత్యం హడావుడి చేయటం ఇష్టం ఉండదు. అది అధికారంలో ఉన్నా.. లేకున్నా. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వేళలోనూ.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరుకు భిన్నంగా తనకు నచ్చినప్పుడు మాత్రమే బయటకు రావటం.. విధానాల్ని ప్రకటించటం చేసేవారు. విమరశల్ని అస్సలు పట్టించుకునేవారు కాదు. సీఎం అయి ఉండి సచివాలయానికి రావాల్సిన పనేమిటి? అంటూ తనకు నచ్చింది చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన టాలెంట్ కేసీఆర్ సొంతం.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫాంహౌస్ కే పరిమితమైన కేసీఆర్.. దాదాపు ఏడాదిన్నర తర్వాత తెర మీదకు వస్తున్నారు. ప్రజల మధ్యకు వచ్చేందుకు ఆయన ప్లాన్ చేసిన భారీ సభ ఎల్కతుర్తి. పార్టీకి పట్టున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ సభను నిర్వహించటం ద్వారా తమ సత్తా చాటాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. అందుకు తగ్గట్లే భారీ వేదిక మొదలు.. ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తక్కువలో తక్కువ 5 లక్షల మంది సభకు హాజరయ్యేలా జనసమీకరణకు ప్లానింగ్ చేపట్టినట్లు చెబుతున్నారు.
మంట పుట్టించే ఎండల్లో చేపట్టిన ఈ భారీ సభను.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాయంత్రం వేళలో సభ ఉండేలా ప్లాన్ చేశారు. అయితే.. సభకు వచ్చే సాధారణ ప్రజలు మాత్రం ఎండ తీవ్రతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక.. ఈ సభలో కేసీఆర్ తప్పించి.. ఇంకెవరూ మాట్లాడకూదన్న విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ ఒకసారి వేదిక మీదకు వచ్చిన తర్వాత ఆయన తప్పించి.. ఇంకెవరూ మాట్లాడకూదదన్నది అప్రకటిత నిర్ణయంగా చెబుతున్నారు. సభా వేదిక వద్దకు కేసీఆర్ రాక ముందు కొన్ని ప్రసంగాలు ఉంటాయని.. లేకుంటే ఇంత భారీ సభ పెట్టినందుకు ప్రయోజనం ఏం ఉంటుందన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ భారీ బహిరంగ సభలో గులాబీ బాస్ ఎంతసేపు మాట్లాడతారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నేతల కంటే అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కనిష్ఠంగా 30నిమిషాలు గరిష్ఠంగా 45 నిమిషాలకు మించి మాట్లాడే అవకాశం లేదని చెబుతున్నారు. కేసీఆర్ ప్రసంగంలో రేవంత్ పాలనపై నిప్పులు ఖాయంగా కురుస్తాయని.. ప్రధాని మోడీ మీద అంతగా విమర్శలు ఉండకపోవచ్చంటున్నారు.
ఇక.. ఎప్పటి మాదిరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద పంచ్ లు.. విసుర్లు ఉండవని చెబుతున్నారు. ఏదో ఒక సందర్భంగా ఒక పొగడ్త చేసే వీలుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మైల్ స్టోన్ గా.. కేసీఆర్ చేతికి తిరిగి అధికారం అందించే అంశంలో ఈ సభ కీలకపాత్ర పోషిస్తుందన్న నమ్మకాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి.