బీఆర్ఎస్ ఆవిర్భావ వేళ... కవిత భారీ కౌంటర్!
ఒకే ఒక్క మాటతో తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ కౌంటర్ ఇచ్చారు.
By: Garuda Media | 27 April 2026 11:07 AM ISTఒకే ఒక్క మాటతో తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్ ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ కౌంటర్ ఇచ్చారు. ఏప్రిల్ 27(సోమవారం) బీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరిమితంగానే అయినా.. ఆ పార్టీ భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పేరు.. జెండాలు మార్మోగేలా కార్యకర్తలను లైన్లో పెడుతోంది. ప్లీనరీని కొందరు నాయకులకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. అయినప్పటికీ గ్రామాలు, మండలాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉదయం 7-11 మధ్యే నిర్వహించాలని తేల్చి చెప్పారు.
ఇలాంటి కీలక సమయంలో కవిత కేవలం ఒకే ఒక్క మాటతో సంచలనం సృష్టించారు. ''మీ టైం పూర్తయింది.. మా టైం మొదలైంది. #TRS'' అని సోషల్ మీడియాలో ఆదివారం రాత్రి పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యల్లో ఎక్కడా ఎవరినీ నేరుగా ఉద్దేశించినట్టు లేకపోయినా.. బీఆర్ ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవ వేళ.. కవిత చేసిన ఈ కామెంట్ .. కోటి అంశాలపై చర్చను లేపేలా ఉండడం గమనార్హం. వాస్తవానికి దీని వెనుక ఉన్న వాస్తవ అర్ధం ఏదైనా.. బీఆర్ ఎస్ పార్టీ పని అయిపోయిందన్న ధోరణి కనిపించిందనే టాక్ వినిపిస్తోంది.
శనివారం టీఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ వేదికపై కూడా కవిత.. దాదాపు ఈ వ్యాఖ్యలే చేశారు. కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని వదిలే యబట్టే.. తెలంగాణ ప్రజలను దూరం పెట్టబట్టే తాను పార్టీ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. తద్వారా.. తెలంగాణలో కేసీఆర్ ప్రభావం లేదని.. ఆమె పరోక్షంగా వ్యాఖ్యానించినట్టు అయింది. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా.. తాజాగా చేసిన కామెంట్.. ``మీ టైం పూర్తయింది.. మా టైం మొదలైంది. #TRS`` అని పేర్కొనడం ద్వారా.. పూర్తిస్థాయిలో కేసీఆర్ వారసురాలిగా తనను తాను ప్రొజెక్టు చేసుకునే ప్రయత్నం అయితే జరిగిందన్న వాదన కూడా వినిపిస్తుండడం గమనార్హం.
