ఏపీలో కాపు రాజకీయం మొదలైంది... !
మరోవైపు.. కూటమి నాయకులు కూడా కాపులను దారి తప్పకుండా చూసుకునేందుకు.. వైసీపీకి అనుకూ లంగా మారకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
By: Garuda Media | 7 Feb 2026 8:00 PM ISTరాష్ట్రంలో కాపులను ఏకం చేసేందుకు కీలక రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారా? వారిని తమ వైపంటే తమ వైపునకు తిప్పుకొనేందుకు అధికార కూటమి, ప్రతిపక్ష(ప్రధాన కాదు) వైసీపీలు రెడీ అయ్యాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న దరిమిలా .. గత 2014 నుంచి కూడా కాపులను సెంట్రిక్ గా చేసుకుని రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరింతగా కాపు రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.
వైసీపీ ఈ విషయంలో రెండు అండుగులు ముందుకు వేసింది. ఇప్పటికే అంతర్గతంగా కాపు నాయకులతో ఆ పార్టీ సీనియర్లు, ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి అంత్యంత సన్నిహితంగా ఉన్న వివాదాస్పద నాయకులను కూడా బరిలోకి దింపినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాపులను ఏకం చేసేందుకు.. తమతో కలిసి వచ్చే వారికి కలుపుకొని పోయేందుకు ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయని తెలిసింది. దీనిలో భాగంగానే శనివారం కాపులు చలో గుంటూరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మరోవైపు.. కూటమి నాయకులు కూడా కాపులను దారి తప్పకుండా చూసుకునేందుకు.. వైసీపీకి అనుకూ లంగా మారకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన బాధ్యతలను జనసేన నాయకులు భుజాన వేసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో అంబటికి మద్దతుగా కాపులను ఏకం చేయడం అనేది పైకి కనిపిస్తున్న వాదన అయితే.. అంతర్గతంగా వారిని కూటమికి దూరంగా ఉంచాలన్న ప్రధాన లక్ష్యంతో వైసీపీ అడుగులు పడుతున్నాయి.
నిజానికి గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ను విమర్శించిన కారణంగా వైసీపీకి కాపులు దూరమయ్యారు. అందుకే.. గత నాలుగు మాసాల నుంచి కూడా వైసీపీ తన స్ట్రాటజీని మార్చుకుని పవన్ పై ఎలాంటి కామెంట్లు చేయడం లేదు. పైగా ఆయనను గౌరవిస్తున్న తీరు కూడా మార్పునకు సంకేతంగా మారింది. ఇప్పుడు అంబటి విషయంలో కాపులను ఏకం చేయడం ద్వారా.. వారిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి మాజీ కాపు మంత్రులు పెద్ద ఎత్తున మంత్రాంగం చేస్తున్నట్టు తెలిసింది.
